ఇఫ్లూలో మరో విషాదం: బిఇడి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ)లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ బిఇడి విద్యార్థిని సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఒడిషాకు చెందిన 24 ఏళ్ల ఉషా సాహూగా గుర్తించారు. ఆమె ఇఫ్లూలో బిఇడి ఏడాది డిప్లమా చదువుతూ విశ్వవిద్యాలయం ఆవరణలోని మల్కాబాయ్ చందా హాస్టల్లో ఉంటోంది.
ఆమె గది నుంచి ఎప్పటికీ బయటకు రాకపోవడంతో సోమవారం రాత్రి మిత్రులకు అనుమానం వచ్చింది. ఫోన్లు చేస్తే కూడా ఎత్త లేదు. మిత్రులు విశ్వవిద్యాలయంలోని మరో విద్యార్థినికి ఫోన్ చేశారు. ఆ విద్యార్థి గదికి వెళ్లి తలుపు తట్టిండి. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీ తలుపును బలవంతంగా తెరిచి లోనికి చూసే సరికి ఆమె ఉరేసుకుని కనిపించింది.
దాంతో విద్యార్థులు బలవంతంగా తలుపులు తెరిచారు. లోనికి వెళ్లి చూసే సరికి ఆమె స్పృహ తప్పి పడి ఉంది. వెంటనే ఆమెను దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు.
సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని, ఆత్మహత్యకు కారణాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఉషా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మంగళవారం ఆమె క్లాస్ రూం ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే తాను ఆ స్థితిలో లేనని ఉషా మిత్రులతో అన్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఈ విశ్వవిద్యాలయం విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.