మద్యంలో తెల్లటి పదార్దం ఎలా కలిసింది?: రెండో రోజు విచారణకు హాజరైన మల్లాది విష్ణు
అమరావతి: బెజవాడ కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండో రోజు విచారణ కోసం దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు. గరువారం ఉదయం ఆయన విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
ఏ క్షణాన్నైనా విష్ణుని సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చునన్న వదంతులతో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ విజయవాడలో తీవ్ర ఉదిక్త్రతలు చెలరేగాయి. అయితే విష్ణుని రాత్రి 11 గంటలకు సిట్ బృందం విచారించి ఆ తర్వాత ఇంటికి పంపించి వేసింది. అయితే సిట్ విచారణలో మల్లాది విష్ణు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది.
బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలను డీఐజీ మహే్షచంద్ర లడ్హా ఆధ్వర్యంలోని సిట్ అధికారుల బృందం విష్ణును అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. స్వర్ణలంక బార్లో జరిగిన కల్తీ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్న బార్ సిబ్బంది విచారణలో బయటపెట్టిన అంశాలకు, విష్ణు చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిసింది.
దీంతో సిట్ అధికారులు గురువారం కూడా విచారిస్తున్నారు. మద్యంలో తెల్లటి ద్రావకం లాంటి పదార్ధం ఎలా కలిసిందని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రశ్నకు గాను ఎవరో కావాలనే ఆ ద్రావకాన్ని కలిపి ఉంటారని విష్ణు చెప్పినట్లుగా తెలిసింది. రాజకీయ నేతగా మల్లాది విష్ణు ఎలా ఎదిగాడనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రశ్నలు గట్టిగా సంధిస్తున్నారు.
గత డిసెంబర్ ఏడో తేదీన మల్లాది విష్ణు సోదరుడి పేరుతో ఉన్న కృష్ణలంకలోని స్వర్ణబార్లో మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం కేసులో ఎఫ్ఐఆర్లో 9వ నిందితుడిగా తన పేరు పోలీసులు చేర్చిన అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన విష్ణు, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసి, బుధవారం (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మల్లాది విష్ణు అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు మల్లాది విష్ణు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.