కృష్ణా జిల్లాలో మళ్లీ చేపల వర్షం: ఈసారి కందనంపాడు ప్రజల వంతు
విజయవాడ: కృష్ణా జిల్లాలో మరోసారి ఆకాశం నుంచి చేపల వర్షం కురిసింది. గురువారం రాత్రి జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల్లోని పోలాల్లో చేపల వర్షం పడిన మరుసటి రోజే కంకిపాడు మండలం కందనంపాడు గ్రామ పొలాల్లో చేపల వర్షం కురిసింది.
శనివారం తెల్లవారుజామున పడిన వర్షానికి కందనంపాడు గ్రామ పొలాల్లో చేపలు కనిపించాయి. వర్షంతో పాటు చేపలు కనిపించడంతో స్ధానికులంతా ఆశ్చర్యపోతున్నారు. వాటిని పట్టుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
అంతే కాదు ఆకాశం నుంచి వర్షం రూపంలో పడిన చేపలు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉండవచ్చని గ్రామస్తులు అంటున్నారు. గురువారం రాత్రి కూడా చేపల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు.
అది కూడా వాలుగ రకం చేపలు కావడంతో జనం వీటి కోసం ఎగబడుతున్నారు. ఆకాశం నుంచి పడిన చేపలు 'వాలగ' రకానికి చెందినవిగా గ్రామస్థులు చెబుతున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు కిలోలు ఉన్న చేపలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో వడిలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుతుగుంటాయి. మన ఊహలకు అందని వింతలూ విశేషాలు జరుగుతుంటాయి.
మూడు సంవత్సరాల క్రితం, 2012 సంవత్సరంలో శ్రీలంకలోని చిలావ్ జిల్లాలో ఒక వింత జరిగింది. ఆకాశం నుంచి చినుకులు రాలుతూ క్రమక్రమంగా రొయ్యలు కురవడం ప్రారంభమైంది. ఈ రొయ్యలు ఒక్కొక్కటి ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వరకూ ఉన్నాయట. వాటన్నింటినీ పోగుజేస్తే, దాదాపు యాభై కిలోల వరకూ రొయ్యలు తేలాయి.
2009 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం నవగాం జిల్లా, భాన్వాడ్ తాలూకా జమ్నావాడ్ గ్రామంలో చేపల వర్షం పడింది. ఆరోజు వాతావరణం మామూలుగానే ఉన్నా, అనుకోకుండా వర్షం కురవడం ప్రారంభించి ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి.