ఏపీ ఈసీ నియామకం: చంద్రబాబు, గవర్నర్ల మధ్య మరో వివాదం?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణకు మేలు చేకూర్చేలా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ వ్యవహారిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఒకలా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు మరోలా స్పందిస్తున్నారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఇలాంటిదే మరో వివాదం గవర్నర్, సీఎం మధ్య వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం అనివార్యమైంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నియామకంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య భిన్నాభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
గతంలో ఐఏఎస్ అధికారిగా ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన చిత్రరంజన్ దాస్ బిస్వాల్ను చంద్రబాబు ఈ పదవికి ఎంపిక చేసి ఆ ఫైల్ను గవర్నర్కు సిఫారసు చేశారు. గవర్నర్ రాజ్యాంగాన్ని పరిశీలించి ఆర్టికల్ 319(బి) ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా పనిచేసిన వ్యక్తులు యూపీఎస్సీ పదవులకు మాత్రమే అర్హులని, మరే పదవికి కాదని పేర్కొంటూ ఫైల్ను నిలుపుదల చేసారని తెలుస్తోంది.
అంతేకాదు ఛీఫ్ సెక్రటరీ స్థాయి వారే ఈ పదవికి అర్హులని, బిస్వాల్కు సీఎస్ స్థాయి లేదని అన్నారని సమాచారం అయితే దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పేర్వారం రాములుకు తెలంగాణ ప్రభుత్వం టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తోంది.
అయితే ఆ పదవి గవర్నర్ పరిధిలోనిది కాదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న వేళ గవర్నర్ నరసింహాన్ మళ్లీ కొత్త వివాదానికి తెరదీశారా? లేక ఈ ఏపీ ఈసీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటారా? చూద్దాం.