జగన్పై దాడి: గవర్నర్ ఆరా, తేలుస్తామని చినరాజప్ప, డీజీపీ ఏమన్నారంటే?, విశాఖలో ఉద్రిక్తత
విశాఖపట్నం/హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో జరిగిన దాడి ఘటనపై గవర్నర్ నర్సింహన్ ఆరా తీశారు. ఏపీ డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్.. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తక్షణమే నివేదిక పంపాలని డీజీపీని ఆదేశించారు.
Recommended Video
జగన్ పై దాడిని ఖండిస్తున్నాం: చినరాజప్ప
విశాఖ విమానాశ్రయంలో వైయస్ జగన్పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. విమానాశ్రయంలో వెయిటర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఆయన వివరించారు.
గంటలో పూర్తి వివరాలంటూ హోంమంత్రి
అసలు కత్తి విమానాశ్రయంలోకి ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. మరో గంటలో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చినరాజప్ప తెలిపారు.
పబ్లిసిటీ కోసమేనా?.. జేబులో లేఖ
దాడి ఘటనపై డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎస్ఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడు పబ్లిసిటీ కోసమే దాడి చేసినట్లు తాము అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడి జేబులో ఓ లేఖ ఉందని, దాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎడమ చేతితో దాడి చేశారని తెలిపారు.
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
భద్రత సీఐఎస్ఎఫ్దే..
సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే నిందితుడు కత్తితో ఎలా లోపలికి వెళ్లాడనే విషయంపై విచారిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయం లోపల భద్రత సీఐఎస్ఎఫ్దేనని డీజీపీ ఠాకూర్ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ ఇంటర్మీడియట్ డ్రాపవుట్ అని చెప్పారు.
విశాఖలో ఉద్రిక్తత..
ఇది ఇలా ఉండగా విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్పై దాడి జరగడంతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నాయి. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగాయి. విమానాశ్రయం చుట్టూ భారీ ఎత్తును వైసీపీ, జగన్ అభిమానులు చేరుకోవడం కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.