విషాదం: పెళ్ళైన రెండు రోజులకే విద్యుత్ షాక్ తో వరుడు మృతి...ఎలా?
పెళ్ళైన రెండు రోజులకే వరుడు విద్యుత్ షాక్ తో మరణించిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకొంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
మదనపల్లె:పెళ్ళైన రెండు రోజులకే వరుడు విద్యుత్ షాక్ తో మరణించిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకొంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ జిల్లా పరగోడుకు చెందిన మిద్ది నరసింహప్ప, నరసమ్మల కుమారుడు నరసింహులుతో ములకలచెరువు మండలం గూడుపల్లె పంచాయితీ కనుగొండవారిపల్లెకు చెందిన వెంకటరమణ, రెడ్డెమ్మల కూతురు ప్రమీలకు ఈ నెల 23న, వివాహమైంది.
ప్రమీల బీఈడీ పూర్తి చేసింది.నరసింహులు బీఏ వరకు చదువుకొన్నాడు. నరసింహులు కేఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొత్త దంపతులు శుక్రవారం సాయంత్రం బంధువులతో కలిసి కనుగొండవారిపల్లెకు వచ్చాడు.
అయితే రాత్రి 8 గంటల సమయంలో బంధువులు, గ్రామస్తులు అందరూ కలిసి నూతన దంపతులకు నలుగులు వేసి భోజనాలు చేశారు. దీంతో పెళ్ళికుమార్తె జంట సందడి వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే శనివారం తెల్లవారుజామున నరసింహులు నిద్రలేచి పడకగదిలోనే తన సెల్ పోన్ ను చార్జింగ్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపటికే చార్జింగ్ చూద్దామని ఆయన సెల్ పోన్ ను చేతికి తీసుకొన్నాడు. సెల్ ఫోన్ కు విద్యుత్ ప్రసారమైంది.దీంతో ఆయన కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడ్డాడు.
బంధువులు నరసింహులును ములకలచెరువు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం మదనపల్లెకు రెఫర్ చేశారు.
మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగానే బాధితుడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.ఈ విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.