మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నర సంవత్సరాలుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని మాధవ్ అద్దెకుండే ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురంలోని రాంనగర్ లో..
గోరంట్ల మాధవ్ తాను ఎంపీగా గెలుపొందాక ఉండటం కోసం మల్లికార్జునరెడ్డి ఇంటిని అద్దెకు అడిగారు. అనంతపురంలోని రాంనగర్ 80 అడుగుల రోడ్డులో ఆ ఇల్లు ఉంది. మొత్తం ఏడున్నర సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించారు. ఆరు నెలలు దాటి మూడు సంవత్సరాలైనా ఇంతవరకు ఖాళీ చేయలేదు. అద్దెకు దిగే సమయంలో 6 నెలలే ఉండి ఖాళీ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతవరకు రూపాయి కూడా అద్దె చెల్లించలేదు. మరికొద్దిరోజులు ఇంట్లో ఉండేలా పెద్ద మనుషులతో చెప్పించారు.

అద్దెతోపాటు విద్యుత్తు బిల్లులు కూడా కట్టలేదు!
మూడున్నర సంవత్సరాల నుంచి అద్దెతోపాటు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సెప్టెంబరు నెలలో ఖాళీ చేయాలని మల్లికార్జునరెడ్డి కోరారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం రేకెత్తింది. పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో 2 నెలలు ఉండేలా అక్టోబరు వరకు గడువు ఇప్పించారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో మల్లికార్జునరెడ్డి మరికొందరు పెద్దలను తీసుకొని ఎంపీ దగ్గరకు వెళ్లి ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఎంపీ వాగ్వాదానికి దిగడంతోపాటు ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. సీఐలు శివరాముడు, జాకీర్ హుస్సేన్ ఎంపీకి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదన్నారు. వారు చెప్పిన మాటలు చెవికెక్కించుకోకుండా తనకే హెచ్చరికలు జారీచేశాడని మల్లికార్జునరెడ్డి తెలిపారు. అద్దెకింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లుల కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని వివరించారు.

కలిసొస్తున్న సామాజిక సమీకరణాలు
గోరంట్ల మాధవ్ వైఖరివల్ల గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఎంపీ దురుసు వైఖరివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెడ్డ పేరు వస్తోందని అధిష్టానం ఆగ్రహంతో ఉంది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. వీడియో వ్యవహారం తర్వాత దూకుడు తగ్గించిన మాధవ్ తాజాగా అద్దె చెల్లించకుండా మరోసారి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications