తెలంగాణ కార్మికులతో నాకు సంబంధం లేదు, అరుపులూ కేకలా: ఎండి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ఇచ్చే పీఆర్సీతో తనకు సంబంధం లేదని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివ రావు చెప్పారు. ప్రస్తుతం ప్రకటించిన 27 శాతం ఫిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ కార్మికులకు మాత్రమేనని ఆయన చెప్పారు. ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఎండికి తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. దాంతో ఆగ్రహించిన సాంబశివరావు చర్చల మధ్యలోంచి లేచి వెళ్లిపోయారు. చర్చల్లో కార్మిక సంఘాల నాయకులు పీఆర్సీ గురించి మాట్లాడకుండా అనవసరపు విషయాలు మాట్లాడారని, ఆర్టీసి ఎండి విదేశీ పర్యటనలకు వారి అనుమతి అవసరమా అని ఆయన అన్నారు.
చర్చల్లో కార్మిక సంఘాల నాయకులు అరుపులూ కేకలూ పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కార్మికులకు ఇచ్చే పిఆర్సీపై తనకు స్పష్టత లేదని ఆయన చెప్పారు. ఎండి సాంబశివ రావు తీరుపై కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము హామీ ఇచ్చిన 27శాతం ఫిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు ఎంత ఇవ్వాలన్నది వారిష్టమన్నారు. ఆస్తులు మినహా విభజన దాదాపుగా పూర్తి అయిందని తెలిపారు. నాలుగు రోజుల్లో క్రమశిక్షణా చర్యలను ప్రస్తావించినట్టు చెప్పారు. ఇకపై తెలంగాణ పీఆర్సీ గురించి మాట్లాడనని చెప్పారు. కావాలంటే ఆర్టీసీ జేఎండీతో చర్చించుకోవచ్చన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని కోరడం తన బాధ్యతన ఎండీ అన్నారు.
సంస్థ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛపేరుతో యాజమాన్యంపై ఆరోపణలు చేయవద్దని మీడియాకు సాంబశివరావు హితవు పలికారు. యాజమాన్య ప్రోద్బలంతోనే లాఠీచార్జి చేశారని నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 30 ఏళ్ల సర్వీసులో 24ఏళ్లు తెలంగాణలో పనిచేశానని, అందుకే చొరవ తీసుకున్నానని తెలిపారు.
తెలంగాణకు ఫిట్మెంట్ ప్రకటించే అధికారం తనకు లేదని, తెలంగాణ ప్రభుత్వమే అది నిర్ణయించాలన్నారు. తెలంగాణ ఫిట్మెంట్ ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని ఆర్టీసీ జేఎండీ స్పష్టం చేశారు.
టీఎంయూ నేతలను చర్చలకు పిలవలేదంటూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తమను అవమానించారని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సాంబశివరావు ఆధ్వర్యంలో చర్చలకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పారు. జేఎండీకి బాధ్యతలు అప్పగిస్తే చర్చలకు వస్తామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని, ఇలాంటి వాతావరణంలో చర్చలు సఫలం కావని ఈయూ నేత పద్మాకర్ అన్నారు.