ట్యాపింగ్: హైద్రాబాద్లో బాబు అభద్రతగా ఫీలవుతున్నారా, అమరావతి ప్లాన్ వేదిక మారింది?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉండటం అభద్రతగా ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు ఆలోచన అలాగే ఉందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబును బద్ద వ్యతిరేకిగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉంటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని భావిస్తున్నారని చెబుతున్నారు.
ఏదైనా ఓ ప్రముఖ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో హైదరాబాదులో చర్చలు జరిపితే, తెలంగాణ ప్రభుత్వం వారి పైన ఒత్తిడి తెచ్చి హైదరాబాదులో యూనిట్ పెట్టేందుకు ఒత్తిడి తెచ్చే అస్కారం ఉందని భావిస్తున్నారంటున్నారు.
గతంలో మంత్రి కెటిఆర్ ఓ కంపెనీ వ్యవహారంలో ఇలా చేసినట్లుగా ఊహాగానాలు వచ్చాయి. సింగపూర్ ప్రభుత్వం మే 25వ తేదీన అమరావతి మాస్టర్ ప్లాన్ను హైదరాబాదులోనే చంద్రబాబు చేతికి అందజేసింది.
అలాగే, సీడ్ ప్లాన్ కూడా హైదరాబాదులోనే ఇవ్వవలసి ఉండెనని, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో వేదిక రాజమండ్రికి మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా పాలనను ఇక్కడి నుంచి ఏపీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.