కిషోర్ వాహనంపై రెబల్ వర్గం దాడి, జగన్ నామినేషన్
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ వాహనాన్ని అరకులో రెబల్ వర్గం కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రెబల్ వర్గం దాడిలో కిషోర్ చంద్రదేవ్ కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. కిషోర్ నామినేషన్ దాఖలు చేసిన ్ అనంతరం తన కారు పైన జరిగిన దాడిని ఈసి దృష్టికి తీసుకు వెళ్లారు.
జగన్ నామినేషన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో పులివెందుల పట్టణం జనసంద్రమైంది. జగన్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జగన్ పైన పూలవర్షం కురిపించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తామన్నారు. అంతకుముందు ఇడుపులపాయ వద్ద తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. జగన్ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇచ్చారు. పులివెందుల అసెంబ్లీకి జగన్ పోటీ చేస్తున్నారు.
బిజెపి అభ్యర్థులపై గంటా
సీమాంధ్రలో బిజెపి అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని టిడిపి నేత గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దైతే విశాఖ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిందన్నారు. అధికారికంగా పొత్తు రద్దైతే పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తానని గంటా తెలిపారు.


Click it and Unblock the Notifications