పోతిరెడ్డిపాడుపై ఏపీ వాదన రెడీ- కేసీఆర్ ముందు షాకింగ్ ప్రతిపాదన పెడుతున్న జగన్..
రాయలసీమకు వరప్రదాయనిగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు కాల్వల సామర్ధ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా శ్రీశైలం డ్యామ్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే అవకాశం చేజిక్కించుకునేందుకు జగన్ సర్కార్ జీవో 203 జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ వ్యూహం మార్చింది. ఏకంగా కేసీఆర్ నే డిఫెన్స్ లోకి నెట్టే అవకాశమున్న ఈ ప్రతిపాదన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
పోతిరెడ్డిపాడు నుంచి చుక్కనీరు తరలించలేరు, విపక్షాలపై మండలి చైర్మన్ గుత్తా ఫైర్..
పోతిరెడ్డిపాడుపై ఏపీ వాదన రెడీ..
పోతిరెడ్డిపాడు కాల్వల సామర్ధ్యం పెంపు కోసం తాజాగా జీవో 203 జారీ చేసిన ఏపీ సర్కార్.. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు తన వాదన వినిపించేందుకు సిద్దమైంది. ఇందులో పోతిరెడ్డిపాడు అభివృద్ధికి గల కారణాలతో పాటు తెలంగాణ దుందుడుకు చర్యల వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రివర్ బోర్డుకు అధికారులు వివరించనున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకాల వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని ఏపీ అధికారులు వివరిస్తారు.
తెలంగాణ ముందు షాకింగ్ ప్రతిపాదన..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రాజెక్టులలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఒకటి. ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మేలు చేసేలా రూపొందించిన ఈ పథకం ద్వారా కృష్ణాజలాలను ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటోందనేది ఏపీ వాదన. దీనికి విరుగుడుగానే పోతిరెడ్డిపాడు కాల్వల సామర్ధ్యం పెంచుకునేందుకు వీలుగా జీవో 203 జారీ చేసినట్లు ఏపీ చెబుతోంది. కాబట్టి తక్షణం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిలిపేస్తే తాము పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్లబోమని ఏపీ అధికారులు రివర్స్ బోర్డు ముందు కుండబద్దలు కొట్టనున్నారు.
Recommended Video
కేసీఆర్-జగన్ ఇద్దరికీ ప్రతిష్టాత్మకం..
అటు తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు, ఇటు పోతిరెడ్డిపాడు పథకం జగన్ కూ ఎంతో కీలకమైనవి. ఈ రెండు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. ప్రస్తుతం విపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శల దృష్ట్యా చూసుకున్నా వీరిద్దరూ వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. మరి కేసీఆర్ ముందు జగన్ ఈ షాకింగ్ ప్రపోజల్ ఎందుకు పెట్టినట్లు అనే కొత్త వాదన మొదలైంది. దీనికి కారణం పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, ఇతర విపక్ష పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టేందుకు వీలుగానే జగన్ ఈ వాదనను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జల వివాదాలెన్నో పరిష్కారానికి నోచుకోక కోర్టుల్లో, ట్రైబ్యునళ్లలో నలుగుతున్న నేపథ్యంలో ఏపీ వాదన కేవలం డిఫెన్స్ కే పనికొస్తుందనేది నిపుణుల అభిప్రాయం.