టిడిపిలోకి నెహ్రూ, మలుపులు: జగన్కు 'కాపు' రివర్స్, చెక్ చెప్పేనా?
విజయవాడ/రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' మరోసారి ప్రయోగించింది. తొలిసారి ఆపరేషన్ ఆకర్ష్లో ఎనిమిది మంది వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. ఈ దఫా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని అంటున్నారు.
జ్యోతుల నెహ్రూ ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అంతర్గతంగా మాత్రం ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నేడో, రేపో టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
వీరితో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిడిపిలో చేరుతానని, చేరడం లేదని... జ్యోతుల ఇంకా డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు. కానీ టీడీపీలో చేరడం మాత్రం ఖాయమని అంటున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరుతానని తన పార్టీ కార్యకర్తలతో చెప్పారని తెలుస్తోంది. మొదటిసారి వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యల కారణంగా 8మంది టిడిపిలో చేరారనే ఊహాగానాలు ఉన్నాయి. అసంతృప్తి వంటి వాటిని పక్కన పెడితే... చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ చెప్పినందువల్లే వారు తమ పార్టీ వైపు వచ్చారని తెలుగుదేశం నేతలు చెప్పారు.
ఈసారి పీఏసీ వైసిపిలో చిచ్చు పెట్టింది. సీనియర్లను పక్కన పెట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్ పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇది జ్యోతుల వంటి వారిని అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. ఈ కారణంగానే జ్యోతుల టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. టిడిపిలోకి నెహ్రూ చేరిక ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతోందనే చెప్పవచ్చు.
నెహ్రూ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనే వార్తల నేపథ్యంలో జగన్ అఫ్రమత్తమై... పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డిని జ్యోతుల నెహ్రూ వద్దకు రాయబారం పంపించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ... రాజకీయం వేరు, స్నేహం వేరు అని చెవిరెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది.
రాజకీయాల కోసం వస్తే ఎవరితోను మాట్లాడనని, స్నేహం కోసం వస్తే మాట్లాడుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయం, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇంత వరకు పార్టీ పరంగా ఏవిధమైన నిర్ణయం తీసుకోకపోవడం లాంటి అంశాలు చెవిరెడ్డితో మాట్లాడారని సమాచారం. నెహ్రూ కాపు అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది జగన్కే రివర్స్ అయిందని అంటున్నారు.
విప్ జారీ చేసినా..
టిడిపిలో ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చేందుకే, అలాగే విప్ ద్వారా టిడిపిలో చేరుదామని భావించే తన పార్టీ ఎమ్మెల్యేలకు చెక్ చెప్పేందుకు జగన్ విప్ అంశాన్ని ముందుకు తెస్తున్నారని చెప్పవచ్చు. గతంలో ప్రభుత్వం పైన, స్పీకర్ పైన జగన్ అవిశ్వాసం పెట్టారు.
టిడిపిలో చేరిన 8 మంది పై వేటు వేయించడమే లక్ష్యంగా జగన్ అవిశ్వాసం పెట్టారు. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు మరోసారి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. తద్వారా టిడిపిలో చేరిన వారిపై వేటు వేయించడం, మరోవైపు తన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరాలనుకుంటే వారికి 'అనర్హత' భయం కల్పించడమే ఉద్దేశ్యమని అంటున్నారు.
ఇందుకు సంబంధించి ఈ నెల 21వ తేదీనే ద్రవ్య వినిమయ బిల్లు విషయమై వైసిపి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. ఈ నెల 29, 30 తేదీలలో సభకు హాజరు కాకపోయినా, ఓటింగులో పాల్గొనకపోయినా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.