బాబుపై బిజెపి కన్నా తీవ్ర వ్యాఖ్య, వెంకయ్య ఎదుటే డిష్యూండిష్యూం
గుంటూరు: మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేబినెట్లో బిజెపి నేత, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేస్తున్న మాణిక్యాల రావు పైన వివక్ష కొనసాగుతోందని అన్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల పనులకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావును చంద్రబాబు దూరంగా పెడుతున్నారని ఆరోపించారు. మాణిక్యాల రావును కలుపుకొని పోవడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయం తాము పూర్తిగా అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. పుష్కరాలలో దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మాణిక్యాల రావు పాల్గొనవల్సి ఉందని చెప్పారు. ఆ పరిస్థితులు లేవని కూడా ఆయన చెప్పారు. అయితే, కన్నా వ్యాఖ్యలను టీడీపీ కొట్టి పారేస్తోంది.
వెంకయ్య సమక్షంలో టిడిపి వర్సెస్ వైసిపి
ప్రొటోకాల్ విషయమై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలోనే టీడీపీ, వైసీపీ నేతలు వాగ్వావాదానికి దిగారు. చివరకు కేంద్ర మంత్రి వెంకయ్య కలుగజేసుకోవడంతో ఇరు పార్టీల నేతలు శాంతించారు.
ఆదివారం ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా చిత్తమూరు మండలం గుణపాటిపాలెంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మధ్య ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది.
ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దూషించుకుంటూ చిందులేయడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. గుణపాటిపాలెంలో పీహెచ్సీని వెంకయ్య ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి వెంకయ్య, సోమిరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు చేరుకున్నారు.
వెంకయ్య సభలో ప్రసంగించేందుకు ఉపక్రమిస్తుండగా వేదికపైకి తమను ఆహ్వానించకపోవడంపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే సోమిరెడ్డి కల్పించుకుని సునీల్ కుమార్తో వాగ్వావాదానికి దిగారు. వెంకయ్య జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించి శాంతింపజేశారు.