పర్యాటక కేంద్రంగా జోడేఘాట్: కెసిఆర్, ‘భీం’ పేరిట జిల్లా
ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీం బాటలోనే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కెసిఆర్.. జోడేఘాట్లో కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. కొమురం భీం మ్యూజియం నిర్మాణానికి ఏర్పాటు చేసిన పైలాన్కు సిఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కొమురం భీంకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ప్రజలు ఏకపక్షంగా టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించారని, ఆదిలాబాద్ జిల్లాను బాగు చేయాలని జిల్లా ప్రజలు తమకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ. 25 కోట్లతో కొమురం భీం స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని చెప్పారు. కొమురం భీం కుటుంబానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా కెసిఆర్ తెలిపారు. కొమురం భీం కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. జోడేఘాట్ కేంద్రంగా 100 ఎకరాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామని అన్నారు. అసిఫాబాద్లో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.
కొమురం భీం పేరు మీద జిల్లాలో గిరిజన యునివర్సిటీని ఏర్పాటు చేస్తామని కెసిఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించి, కొత్త జిల్లాకు కొమురం భీం పేరు పెడతామని చెప్పారు. బంజారాహిల్స్లో బంజరాభవన్, ఆదివాసీ భవన్ నిర్మిస్తామని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల నీళ్లు ముందుగా జిల్లాకే కేటాయించి, ఆ తర్వాతనే ఆ నీటిని బయటకు పంపిస్తామని చెప్పారు. 2,3 రోజులు ఉండి ఇక్కడి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు.
రోగాల బారినపడి మరణిస్తున్న గిరిజనుల సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి గిరిజన తాండాలకు డాక్టర్లను పంపించి వైద్యాన్ని అందిస్తామని కెసిఆర్ అన్నారు. 500మంది కళాకారులతో 20బృందాలుగా ఏర్పాటు చేసి గిరిజనులను చైతన్యం చేసేలా కార్యక్రమాలు చేపడ్తామని అన్నారు.