ప్రజా సంకల్ప యాత్ర: కెఈని టార్గెట్ చేసిన జగన్
కర్నూలు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు.
కర్నూలు: కర్నూలు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధిక అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు సీట్లను కర్నూలు జిల్లా కట్టెబెట్టింది. కర్నూలు జిల్లా నుంచే మరోమారు తొలి అభ్యర్థిని జగన్ ప్రకటించారు.
2014 ఎన్నికలకు ముందు డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిని తొలి అభ్యర్థిగా ప్రకటించిన జగన్ తాజాగా 2019 ఎన్నికల్లో తమ పార్టీ తొలి అభ్యర్థిగా పత్తికొండ నుంచి చెరుకులపాడు శ్రీదేవిని ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాలు కర్నూలు జిల్లావే కావడం యాదృచ్ఛికమే.
Recommended Video
అయితే రెండుచోట్ల వైసిపి ప్రత్యర్థులు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులే కావడం విశేషం. 2014 ఎన్నికలకు ముందు డోన్ నుంచి కెఇ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పత్తికొండ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుచోట్ల కెఇ ఉండటంతో ఆయననే లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటూ అప్పుడే చర్చ ప్రారంభమైంది.
బుట్టా రేణుకపైనా...
కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున తానే పోటీ చేస్తానని ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పదే పదే చెప్పారు. దాన్ని టీడీపీ ఖండించలేదు. దీంతో ఈసారి కర్నూలు ఎంపీ స్థానం నుంచి వాల్మీకులకు టికెట్ ఖాయమని జగన్ మరో హామీని ఆ వర్గం వారికి ఇచ్చారు.
బుగ్గన ఇలా....
2009 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చిన డోన్ నియోజకవర్గం బేతంచెర్లకు చెందిన బుగ్గన కుటుంబం ఆ తర్వాత తటస్థ వైఖరిని అవలంబించింది. అయితే 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వైసిపిలో చేరారు. ఈ క్రమంలో ఓదార్పు యాత్ర పేరుతో డోన్ వచ్చిన జగన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ డోన్ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేరును ప్రకటించారు. అప్పటి వరకూ వైకాపా అభ్యర్థులను ఎవరినీ ప్రకటించలేదు. దీంతో బుగ్గన కుటుంబానికి చెందిన రాజేంద్రనాథరెడ్డికి తొలి టికెట్ ఇస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి డోన్ ఎమ్మెల్యేగా వైసిపి తరఫున విజయం సాధించారు.
ఇలా కెఈ విజయం...
గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా కోట్ల హరిచక్రపాణిరెడ్డి పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి టిడిపి అభ్యర్థి కెఇ కృష్ణమూర్తి విజయం సాధించారని, నారాయణరెడ్డి, హరిచక్రపాణిరెడ్డిలలో ఒకరు మాత్రమే బరిలో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఇప్పటికీ రాజకీయంగా చర్చ సాగుతోంది. ఎన్నికల అనంతరం కోట్ల హరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మౌనంగా ఉండిపోయారు. దాంతో నారాయణరెడ్డి వైసిపిలో చేరి పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి పదవి చేపట్టారు. మూడు నెలల క్రితం చెరుకులపాడు నారాయణరెడ్డి దారు ణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కు కెఈ కుటుంబమే కారణమని ప్రస్తుత పత్తికొండ ఇన్చార్జి శ్రీదేవి ఆరోపిస్తూ వచ్చారు. హత్యకు గురైన నారాయణరెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించి జగన్ తన విశ్వసనీయతను చాటుకున్నారని వైసిపి నేతలు అంటున్నారు.
కెఈ నుంచి గుట్టు దాచారు...
అమరావతి: సర్వే, సెటిల్మెంట్ శాఖ మరోసారి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నుంచి రహస్యాలు దాచింది. ఆయనకుఅసమగ్ర సమాచారమిచ్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అధికారుల అవినీతి, అక్రమాస్తుల కేసుల గురించి ఆ శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే అది స్పష్టమవుతుందని కూడా ఆ వార్తాకథనం సారాంశం. అత్యంత కీలకమైన విషయాలను దాచి పెడుతూ కొందరు అధికారులను కాపాడేలా ఈ నివేదికను రూపొందించారని అంటున్నారు. ఉపయోగం లేవనుకున్న అంశాలను కావాలని నివేదికలో చేర్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెటిల్మెంట్ కమిషనర్లు తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైన ఒకదాన్ని దాచేసి కేవలం రెండు విషయాలను గురించే నివేదించారని ఆ వార్తాకథనం తెలియజేస్తోంది.
కెఈపై జగన్ ఇలా...
డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తిని చూస్తే జాలేస్తోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అన్నారు. జగన్ తలపెట్టిన మహా సంకల్ప పాదయాత్ర ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో ఆ వ్యాఖ్య చేశారు. డిప్యూటీ సీఎంకు పదవి ఉందే తప్ప ఒక ఆర్డీవోను కూడా బదిలీ చేయలేకపోతున్నారన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి కోడుమూరు-పత్తికొండ నియోజకవర్గాల మధ్య హంద్రీ నదికి వంతెన నిర్మించలేకపోతున్నారని ఆయన విమర్శించారు.