జగన్కు విశాఖ ధమ్కీ: టిడిపిలోకి కొణతాల, దాడి?
విశాఖపట్నం: విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెద్దగానే దెబ్బ తగులుతోంది. ప్రధానమైన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రాష్ట్రస్థాయి నాయకులుగా గుర్తింపు పొందిన సబ్బం హరి, దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్బై చెప్పేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు తిరిగి సొంతింటికి చేరుకునే సన్నాహాల్లో ఉన్నట్టు సమాచారం. కొణతాల రామకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వచ్చే మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కొణతాలకు మేయర్గా పోటీ చేసే అవకాశం ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చినా కొణతాల ఖండించకపోవడం విశేషం.
కొణతాల రామకృష్ణ బిజెపిలో చేరుతారంటూ అప్పట్లో ప్రచారం సాగింది. సబ్బం హరి ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. సబ్బం హరి కూడా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు కావూరి సాంబశివ రావు ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలావుంటే, వైస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయన ఇంట్లో కలిశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చొక్కాకుల వెంకటరావు, విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బోకం శ్రీనివాసరావులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.