శ్రీహరి సేవాతత్ప్రత: ఎంపి అయ్యేవారన్న లక్ష్మీపార్వతి
నిజ జీవితంలో ఎంతో సేవ చేస్తున్న శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చేస్తారని అభిమానులు ఆనందపడ్డారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న శ్రీహరి తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆయనతో ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు కూడా. తాను త్వరలో ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
శ్రీహరి సొంతురు కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు. ఆయనకు హైదరాబాదులోని బాలానగర్తో మంచి అనుబంధముంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించారు. నగరంతో మంచి అనుబంధమున్న తమ హీరో కూకట్పల్లి నుండి పోటీ చేయాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కలలు కన్నారని కానీ ఆయన ఇలా హఠన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని ఫ్యాన్స్, బాలానగర్ వాసులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
శ్రీహరికి సిని ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు.. ఇలా అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సేవాభావం కల వ్యక్తిగా అందరు గౌరవిస్తారు. తన కూతురు అక్షర మృతి చెందడంతో ఆమె పేరిట అక్షర ఫౌండేషన్ స్థాపించి విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. కిందిస్థాయి నుండి ఎదిగిన శ్రీహరి మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు.
శ్రీహరి మంచి నటుడు అని, ఏ పాత్రనైనా అవలీలగా చేసేవారని, సేవాగుణం కలిగిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఏ ఎంపియో, మినిస్టరో అయి ఉండేవారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి గురువారం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన తర్వాత అన్నారు. శ్రీహరి యువజన కాంగ్రెసులో పని చేశారని, ఎంతో కష్టపడి ఏదైనా సాధించవచ్చునని నిరూపించారని, యువత అదే దారిలో నడవాలని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు.
శ్రీహరికి భౌతిక కాయానికి తెరాస నేత కె కేశవ రావు, మాజీ మంత్రి కొండా సురేఖ, టిడిపి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీ పార్వతి, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు తదితర రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.