నమ్మి వస్తే!: తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. అతడే కారణమని లేఖ
నమ్ముకుని వస్తే మధ్యలో ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడని సంధ్యారాణి మనస్తాపం చెందింది.
పిడుగురాళ్ల: నమ్మి వస్తే మధ్యలోనే వదిలేశాడన్న కారణంతో ఓ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. పంచదారలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి.సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింటిలోనే ఉంటోంది. ఇదే క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్ సంధ్యారాణికి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సహజీవనానికి దారితీసినట్టు తెలుస్తోంది.
ఇద్దరు కలిసి పిడుగురాళ్లలో ఉంటున్నారు. ఇటీవల ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. కోపోద్రిక్తుడైన అనుదీప్ సంధ్యపై చేయి చేసుకుని అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అతను గుంటూరులో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు ఇటీవల సంధ్యారాణి దృష్టికి వచ్చింది.
నమ్ముకుని వస్తే మధ్యలో ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడని సంధ్యారాణి మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి మైలతుత్తాన్ని పంచదారలో కలుపుకుని ఇడ్లీలో తినేసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విగతజీవిగా పడి ఉంది. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది.
మృతదేహం వద్ద ఓ సూసైడ్ లెటర్ గుర్తించారు పోలీసులు. ప్రేమికుడే తన చావుకు కారణమని సంధ్యారాణి అందులో పేర్కొంది. నమ్మి వచ్చినందుకు వంచించాడని, వాడిని వదలొద్దని లేఖలో వాపోయింది.