సంచలనం: 'వైయస్ ప్రమాదం జరిగిన రోజే జగన్ ప్రయత్నాలు, విజయసాయి కుట్ర'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజునే ఆయన తనయుడు జగన్ పోలవరం ప్రాజెక్టు టెండర్ల కోసం ప్రయత్నాలు చేశారని షాకింగ్ ఆరోపణ చేశారు.
ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ పోలవరం టెండర్ల కోసం ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులను ప్రతిపక్ష నేత దక్కించుకోలేకపోయారని చెప్పారు.

పోలవరం ద్వారా ప్రకాశంకు నీరు
పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 12,800 కోట్లు ఖర్చు చేశామని మంత్రి దేవినేని చెప్పారు. పోలవరం గ్రావిటీ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయని చెప్పారు. 2018 నాటికి 17వేల క్యూసెక్కుల నీరు తరలిస్తామని చెప్పారు.

చంద్రబాబు, గడ్కరీ వస్తారు
జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని దేవినేని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

జగన్-విజయసాయిల కుట్ర
తాము సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని దేవినేని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరదాయిని అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. జగన్, విజయసాయిరెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్నారు.

కాకాణిపై పరువు నష్టం దావా
వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి తనకు, తన కుటుంబ సభ్యులకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశారంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం నెల్లూరు జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన కాకాణి రూ.5 కోట్లు చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసే వ్యూహంతోనే విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసును కూడా దాఖలు చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications