అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ;ఇదే తొలిసారి:మంత్రి పరిటాల సునీత
అనంతపురం:రాష్ట్రంలోనే తొలిసారిగా హిజ్రాలకు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత ఫించన్లు పంపిణీ చేశారు.అనంతపురంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ జరుగగా ఈ కార్యక్రమానికి మంత్రి సునీత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిజ్రాలు కూడా సమాజంలో ఒక భాగమేనన్నారు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని వారిని మనతో సమానంగా ఆదరించాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం హిజ్రాలకు పించన్లు పంపిణీకీ శ్రీకారం చుట్టిందన్నారు. నెలకు 1500 రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించను అందించడం జరుగుతుందన్నారు. అర్హత నిర్థారణ కోసం హిజ్రాలు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఫించనుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
హిజ్రాల వెతల పై చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.హిజ్రాలు కూడా డ్వాక్రా సంఘాలకు ధీటుగా సంఘాలుగా ఏర్పడి బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఎపిలో హిజ్రాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతోందన్నారు.