రావెల మెడకు మరో వివాదం : అమ్మాయిల హాస్టల్లో అనుచరులకు ఆశ్రయం!
గుంటూరు : ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు మరోసారి తన వివాదస్పద తీరుతో వార్తల్లోకి ఎక్కారు. అనుచరుల కోసం నిబంధనలను సైతం విస్మరించి బాలికల సాంఘీక సంక్షేమ హాస్టల్ లో వారికి ఆశ్రయం కల్పించారు. బాలికల హాస్టల్లో మగవారికి విడిది ఏర్పాట్లు చేయరాదన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ఆయన వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, బుధవారం నాడు గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో.. ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో.. దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను నిర్వహించిన సంగతి తెలిసిందే. రుణమేళాలో పాల్గొనడం కోసం అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి మంత్రి రావెల అనుచరులు వందకు పైగానే గుంటూరుకు వచ్చారు.
ఈ క్రమంలో.. వచ్చిన అనుచరులందరికీ కలెక్టరేట్ రోడ్డులోని పరివర్తన్ భవన్ లో ఆశ్రయం కల్పించారు. అదే భనన్ లో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ కూడా ఉంది. ఈ విషయాన్ని లెక్కచేయని మంత్రి గారు అదే భవన్ లో తన అనుచరులకు ఆశ్రయం కల్పించడంతో.. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పదవిలో ఉన్నాం కదా..! ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో.. ఇలా నిబంధనలను సైతం తుంగలో తొక్కితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు విషయం తెలిసిన జనం. మరి మంత్రి రావెల దీనికి ఏం సమాధానం చెబుతారో!