ఆరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం.. కచ్చితంగా అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ
మంత్రివర్గ విస్తరణ జరగబోయే ఏప్రిల్ 2న విజయవాడలోనే ఉంటానని బాలకృష్ణ ప్రకటించారు. ఆరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
అమరావతి: మంత్రివర్గ విస్తరణ.. ఇప్పుడీ మాట కొంతమంది టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతుంటే.. మరికొందరు నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎటూ ఏప్రిల్ 2 మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోవడంతో.. ఇక కేబినెట్ లో ఉండేదెవరో?.. ఊడెదెవరో? అన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు కొత్తగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పలు రాజకీయాంశాలపై, ఆయన సినిమా విశేషాలపై స్పందించారు.
మంత్రివర్గ విస్తరణ జరగబోయే ఏప్రిల్ 2న విజయవాడలోనే ఉంటానని బాలకృష్ణ ప్రకటించారు. ఆరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో 'ఎన్టీఆర్' జీవిత చరిత్రతో తెరకెక్కించే సినిమాపై కూడా ఆయన స్పందించారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అవుతుందని చెప్పారు.
ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాకు మునుపెన్నడూ లేని రీతిలో నీటి కేటాయింపులు జరిగాయన్నారు. అసెంబ్లీ సమావేశాల గురించి ప్రస్తావిస్తూ.. ఇరు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయన్నారు.
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 2న జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రులు రావెల కిశోర్ బాబు, పీతల సుజాత సహా మరో నేతపై వేటు పడుతుందన్న లీకులు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్ను మంత్రివర్గలోకి తీసుకుంటారని తెలుస్తోంది.