బూటు కాలితో తన్నించినా భరిస్తా: బాబుకు ముద్రగడ లేఖ
విజయవాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరోసారి లేఖాస్త్రం సంధించారు. "నా ప్రజలకు (జాతికి) మీరు ఇచ్చిన హామీనే అమలు చేయమంటే కోపం వచ్చి నా కుటుంబాన్ని అవమానించినందుకు నాకు ఎటువంటి చింత లేదండి. దీనిపై మీ నుండి విచారం గానీ, క్షమాపణలు గానీ కోరడం లేదండి. నా శరీరంలో చీము, నెత్తురు, పౌరుషం లేదండి మీ దయవల్ల. నేనొక అనాధను, అల్పుడను" అని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...
ఇంకా ఎన్ని అమవాలు చేసినా, చేయించినా ఆఖరికి బాటు కాలితో తన్నించినా భరిస్తాను. ఆర్థికంగా, సాంఘికంగా దుర్భరమైన పరిస్థితిలో ఉన్న సుమారు రెండు కోట్ల మంది నా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) కోసం పోరాటం చేయడం నా బాధ్యతగా భావించి నేను సిద్ధపడ్డాను.
గాంధీ, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ ఇలా....
గతంలో మహాత్మాగాంధీ గారు, పొట్టి శ్రీరాములుగారు, శ్రీ నందమూరి తారకరామారావుగారు వంటి గౌరవ పెద్దలు ఆమరణ నిరాహార దీక్షలు పలు సమస్యల మీద చేసినప్పుడు ఎంతో గౌరవం ఇచ్చేవారు. దీక్ష అంటే ఒక తపస్పు వంటిదని గజ్జెల మల్లారెడ్డి గారు లాంటి వారు చెప్పడం జరిగింది.
ఇది రాజ్యాగం ప్రజలకు ఒక హక్కు అటువంటి దీక్షలు తమరు కూడా ఢిల్లీలోను, హైదరాబాద్లోను చేసినట్టు నాకు గుర్తు. మీరు చేసిన దీక్షలు దొంగ దీక్షలని ఒక ఉద్యమకారుడిగా ఎప్పుడూ తప్పుగా అనటం గానీ అనిపించడం గానీ నేను చేయలేదు. వ్యవసాయం చేయడం చాలా దండగని మీరు పదే పదే అన్నట్లుగానే ఆమరణ దీక్షలు చేయడం కూడా శుద్ధ దండగ అని మీ పాలన ద్వారా అర్థమైంది.
నా తండ్రి చెప్పారు...
నా తండ్రి 1977 జులై 9వ తేదీన జనరల్ హాస్పిటల్ కాకినాడలో (గుండె జబ్బు) కన్ను మూసే సమయంలో నన్ను దగ్గరకు పిలిచి నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఎవరికి అన్యాయం చేయకుండా బతుకు (డా. వెంకయ్య చౌదరిగారి సమక్షంలో) అని చెప్పిన మాట ప్రకారం అన్నిటిలోను నీతి, నిజాయితీలు పక్కన పెట్టకుండానే బతికాను..
నాకు ఎన్ని ఆర్థిక బాధలు ఉన్నా ఊపిరి ఉన్నంత వరకు నీతి, నిజాయితీలను వదలకుండా కొనసాగిస్తాను. ఎవరినీ మోసం చేయనండి. నన్ను నిరాహార దీక్ష సందర్భంగా ప్రలోభ పెట్టి, అడవిలో వదిలినా నిజాయితీగానే దీక్ష చేస్తాను తప్ప తప్పు చేయడమనేది ఈ రక్తంలో లేదనేది గమనించమని కోరుతున్నాను.
మీరూ మీ కుమారుడు సిద్ధపడితే..
నేను చేసిన దీక్షలపై మీ శిష్యులత చేత తప్పుగా విమర్శలు చేయించటం మీ లాంటివారికి తగదని తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సమస్యగా మారిన ప్రత్యేక హోదా గురించి కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి మీరు, మీ కుమారుల వారు సిద్ధపడితే నేను కూడా మీతో పాటు మీ ఇంటిలోనే చోటు ఇస్తే దీక్షలో కూర్చుంటాను.
ఎవరు ఎన్ని రోజులు చేయగలరో మనం దీక్షలో పరీక్షకు నిలపడదాం. ఈ దీక్ష సవాలుగా స్వీకరించడం వల్ల ప్రత్యేక హోదాతో పాటు మన శరీరాల పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి ప్రజలకు తెలుసుకునే అవకాసం ఉంటుంది. నా సూచన మీరు స్వీకరిస్తే నేను మీతో పాటు దీక్షలో కూర్చొనుటకు సిద్ధంగా న్నాను. దయచేసి ఈ నా సలహాను పాటించి కబురు పెట్టమని ప్రార్థిస్తున్నాను.
08-02-2016వ తేదీన నన్ను ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేయడానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కిర్లంపూడి నా ఇంటి ఆవరణలో ప్రెస్ మీట్లో 7 మాసాలలో బిసి కమిషన్ నివేదిక తెప్పించుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది.
గడువు ముగుస్తోంది...
ఆ గడువు సెప్టెంబర్ 7వ తేదీతో పూర్తవుతుంది. బ్రిటిష్ వారి కాలంలో ఉన్న చట్టాలు, వారు కట్టిన బిల్డింగులు వాడుకోవడానికి మనకు అభ్యంతరం లేదు కానీ వారి పాలనలో జాతికి ఉన్న బిసి రిజర్వేషను తిరిగి జీఓ ద్వారా పునరుద్ధరించమంటే నీళ్లు నములుతున్నారు.
జిఓ కన్నా కమిషన్ రిపోర్టుతో రిజర్వేషన్లు ఇస్తే చట్టబద్దంగా ఉంటుంది, ఎవరు కోర్టుకు వెళ్లినా నష్టం ఉండదు అని ఎన్నోసార్లు మా పెద్దలకు, ప్రెస్ మీట్లోను చాలా సార్లు మీరు చెప్పడం, నా వద్దకు మీరు పంపిన పెద్దలు కూడా మీ మాటగా నాకు చెప్పడం జరిగింది.
కోట్ల జీవో ఇచ్చారు...
ఇప్పటికే పుట్టుస్వామి గారి కమిషన్, దాళ్వా సుబ్రహ్మణ్యం గారి కమిషన్, మండల్ కమిషన్ రిపోర్టులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు 30 నెం. జీఓ ఇవ్వడం జరిగింది. దీనిపై హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా సదరు జీఓను సమర్థిస్తూ తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. అన్ని పరిశీలించి మా ప్రజల (జాతికి)కు ఇచ్చి హామీ అమలు చేయండి.
మాటి మాటికీ ఇది చాలా సున్నితమైన విషయం అని పదే పదే తమరు చెప్పటడం చాలా వింతగా ఉంది. ఈ విషయం 2014 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, ఎన్నికల సభల్లో చెప్పినప్పుడు తమకు తెలియదా ముఖ్యమంత్రి గారూ... ఇంకా వంకలు చూడవద్దు, వెతకవద్దు. అసలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి.
నాకు ఆ అలవాటు లేదు...
ఉద్యమాలే కాదు పదవులు చేపట్టినప్పుడు కూడా చాలా నిబద్ధతతో ఉంటాను. శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడుగా పదవులు నిర్వహించినప్పుడు రాజీనామా చేసినా, పదవీకాలం పూర్తయినా నెలల తరబడి ప్రభుత్వం కల్పించిన వసతులు వాడుకునే అలవాటు లేదు. గడువు ముగిసిన రోజున బంగ్లా ఖాళీ చేయడం నాకు అలవాటు.
పదవీ కాలం ముగియగానే బంగ్లా ఖాళీ చేసేవారు, చేసినవారు ఎవరన్నా ఉన్నారా చూసుకోండి. నా నిబద్ధత అలాంటిది. ఇవన్నీ తెలిసీ కూడా ఎంతో మందితో నన్ను తిట్టిపోస్తూ ఉన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు (మీరు ఇచ్చిన హామీలే) పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి, అలా కాకుండా హామీయే ఇవ్వలేదు....
జగన్ గారో... మోడీ గారో...
దీని వెనక జగన్గారో, సోనియా గాంధీగారో, మోడీ గారో ఉన్నారని ఎవరో ఒకరితో ఒకరితో ఎదురు దాడులు చేయించడం ఆపించండి. అయ్యా ఒక విషయం. మీరు హామీ ఇచ్చి ఉండకపోతే మీ దరిదాపులకు అసలు నేను గానీ నా జాతి గాని వచ్చి ఉండేవారం కాదు. ఈ సమస్యను మీ ముందుకు తెచ్చేవారము కాదు.
తమ ప్రజలకు (జాతికి) బిసి రిజర్వేషను కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూలులో చేర్చమని, అసెంబ్లీలో చేసే తీర్మానం కోసం ఎదురు చూస్తున్నానంటూ ముద్రగడ తన లేఖను ముగించారు.