టీడీపీ ఎమ్మెల్సీ కారు బీభత్సం: మృతి, ఒకరు కోమా
తిరుపతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన నేత కారు ఢీకొనడంతో ఓ అభాగ్యుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బి. నరేష్ కుమార్ రెడ్డి నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఆయన కారు మదనపల్లిలోని దేవతా నగర్ దగ్గర ఆటోను ఢీకొనింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆటోలో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి కోమాలో ఉన్నాడని పోలీసులు అన్నారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి కారులో ఉన్నారని కొందరు, ఆయన కారులో లేరని కొందరు అంటున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నరేష్ కుమార్ రెడ్డి మదనపల్లి మునిసిపాలిటి కార్పొరేషన్ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు పని చేశారు.
అదే సమయంలో చిత్తూరు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో ఒక్క ఓటుతేడాతో ఓడిపోయారు. తరువాత నరేష్ కుమార్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించారు.
అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారీ కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీ (చెప్పుల గుర్తు) నుంచి మదనపల్లి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ సీపీ నాయకుడు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో ఓడిపోయారు.
హైకోర్టులో ఎమ్మెల్సీగా నరేష్ కుమార్ రెడ్డి గొలుపొందారని తీర్పురావడంతో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఇదే సంవత్సరం జులై 25వ తేదీన నరేష్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి చాల సన్నిహితుడు.