మాట నిలబెట్టుకున్న చంద్రబాబు!: అమరావతికి మరో కొత్త రైలు, రూట్ ఇదే
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి మరో కొత్త రైలు వచ్చింది. రాజధాని అమరావతి నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం మధ్య పరుగులు పెట్టనున్న ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రాయలసీమ ప్రాంత ఉద్యోగులకు, ప్రజలకు వరప్రదాయనిగా మారనుంది.
వివరాల్లోకి వెళితే... మిత్రధర్మంలో భాగంగా టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సీటుని బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు విజయవాడకు వచ్చిన క్రమంలో ఆయనకు ఆంధ్ర రుచులతో అదరిపోయే విందు ఇచ్చారు.

ఈ విందు రాజకీయంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. ''రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో ప్రతి నెలా సమావేశమవుతాను. ప్రతి రెండు నెలలకు ఓ కొత్త రైల్వే ప్రాజెక్టును తీసుకువస్తాను'' అని ఆనాడు ఆయన ప్రకటించారు. చెప్పినట్లే ఇటీవలే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలి వచ్చే ఉద్యోగుల కోసం హైదరాబాద్-అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుని సాధించారు.
ఈ రైలు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ చకాచకా జరిగిపోయింది. ఆ తర్వాత ధర్మవరం-అమరావతి రైలుపై కన్నేసిన చంద్రబాబు, రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో కొత్త రైలును ప్రకటించేలా చేశారు. ఈ కొత్త రైలుని వచ్చే మంగళవారం సురేశ్ ప్రభు ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ సాయంతో ప్రారంభిస్తారు.
వారానికి మూడు రోజులు (సోమ, బుధ, శని) వారాల్లో విజయవాడ నుంచి బయల్దేరే ఈ రైలు అమరావతి మీదుగా ధర్మవరం చేరుతుంది. ఆ మరుసటి రోజుల్లో తిరిగి ధర్మవరం నుంచి అమరావతి వెళుతుంది. ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను అంటే టైం టేబుల్, రైలు నెంబర్లను రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications