కోటి మృతితో భగ్గు: హోదాలో మరో డిమాండ్! సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముని కోటి ఆత్మబలిదానం చేసుకున్నారు. మునికోటి మృతి అనంతరం ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పైన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి పైన విపక్షాలు మండిపడుతున్నాయి.
విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ వంటి రాజధానిని కోల్పోయిందని, దానిని పూడ్చేందుకు నాడు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇచ్చాయని, ఆ హామీని నెరవేర్చాలని అన్ని పక్షాలు అంటున్నాయి.
ఓ వైపు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తూనే మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వాలని బంద్ ఆందోళనల్లో నిలదీస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయలేదని, అందుకే ఆలస్యమవుతోందని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అంతకుమించి ఏపీకి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
అయితే, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు... ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు. హోదాతో పాటు ప్యాకేజీలు కూడా కావాలని హోదా సాధనా సమితి డిమాండ్ చేస్తోంది.
ప్రత్యేక హోదా పైన బిజెపి నేతలు, కేంద్రమంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. హోదా విషయంలో టిడిపి ఎంపీలు పార్లమెంటులో డ్రామాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు.
సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీ భద్రత
ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ బంద్ నేపథ్యంలో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.