మనసు మారొచ్చు: టిపై పళ్లం, యుఎస్లో చిద్దూకు సెగ
హైదరాబాద్: విభజన విషయంలో కేంద్రం మనసు మారవచ్చునని కేంద్రమంత్రి పళ్లం రాజు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, అధిష్టానం మనసు మారవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అంశంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కేంద్రానికి లేఖ ఇచ్చిందో లేదో తనకు తెలియదని చెప్పారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర సమైక్యతకు మంత్రులుగా మేం చేయాల్సింది చేశామని, విభజన వైపే కేంద్రం మొగ్గుచూపుతోందన్నారు. అయితే కేంద్రం మనసు మారినా మారవచ్చునన్నారు. హైదరాబాద్తో సీమాంధ్రుల బంధం విడదీయలేనిదని, సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు.
సమైక్య సెగ
తూర్పు గోదావరి జిల్లాలో పళ్లం రాజుకు సమైక్య సెగ తగిలింది. పిఠాపురంలో ఆయన కాన్వాయ్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అక్కడి నుండి పంపించి వేశారు. ఆ తర్వాత కాకినాడలో ఎపిఎన్జీవోలు పళ్లం రాజును ఘెరావ్ చేశారు. రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు.
వాషింగ్టన్లో చిద్దూకు సమైక్య సెగ
వాషింగ్టన్ ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి ఎపి ఎన్ఆర్ఐ సంఘం సభ్యులు శాంతియుత నిరసన తెలిపారు. వాషింగ్టన్ డిసిలోని ప్రపంచ బ్యాంకు కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. చిదంబరం వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.