బాబుకు ఆ విషయం అప్పుడే చెప్పా, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా!: పవన్ కళ్యాణ్
పాడేరు: బాక్సయిట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరు, అధికార పార్టీని సమస్యలపై నిలదీయరని జనసేన అధినేత పవన్ ళ్యాణ్ అన్నారు. జనసేన ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అన్నారు. పాడేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పచ్చటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరన్నారు.
బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
చంద్రబాబుకు ఆ విషయం ముందే చెప్పా
చంద్రబాబుకు అనుభవం ఉందని గత ఎన్నికల్లో మద్దతిచ్చామని, కానీ ఆయన మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్లారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పినట్లు చేయకుంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాను నిలదీస్తానని చంద్రబాబుకు 2014 ఎన్నికలకు ముందే చెప్పానని అన్నారు. చెప్పినట్లు చేయకుంటే నిలదీస్తామని, ఎదురుతిరుగుతామని చెప్పానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇక్కడకు వచ్చి బాక్సైట్ తవ్వకాలు అడ్డుకుంటామని చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారన్నారు. దీనిని తాము వ్యతిరేకించామన్నారు.
వైసీపీ సభకు వెళ్లదు
దీనిపై నిలదీయాల్సిన వైసీపీ అసెంబ్లీకి వెళ్లదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక్కడి తవ్వకాల్లో వాళ్లకు కూడా భాగం ఉందని ఆరోపించారు. రక్షించేవారే దోపిడీ చేస్తే ఎలా అన్నారు. ఇక్కడి అక్రమ మైనింగ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బలయ్యారని, వారి మరణానికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. జనసేన బాక్సైట్ తవ్వకాలకు, పర్యావరణ ధ్వంసానికి వ్యతిరేకమన్నారు. జనసేన యువ నాయకత్వం కోరుకుంటోందన్నారు.
కన్నీరు పెట్టించే సమస్యలు
బాక్సైట్ మైనింగ్ గురించి జగన్ నోరు ఎందుకు ఇప్పడం లేదని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు మైనింగ్ చేసి దోచుకోవడానికే వచ్చారని విమర్శించారు. జనసేన బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఒక్క ఎమ్మెల్యే లేకుండా, పదవి లేకుండా ప్రజల కోసం పోరాడుతున్నామని, ఇంకా పోరాడుతామని చెప్పారు. సొంతగా పెట్టిన పార్టీ, ప్రజల నుంచి పుట్టిన పార్టీ జనసేన అన్నారు. చంద్రబాబు, జగన్లవి సొంత పార్టీలు కాదన్నారు. తనకు కొంచెం జ్వరంగా ఉండటం వల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నానని, క్షమించాలని సభికులను ఉద్దేశించి చెప్పారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కన్నీరు పెట్టే సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. తాను విమానాశ్రయం నుంచి వస్తుండగా ఓ పెద్దావిడ తనను ఆపి మాకు నెలకు రూ.2000వేలు వద్దని, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడిగిందని చెప్పారు.