ప్రభుత్వం ఫెయిలైతే చివరి అస్త్రం: రాష్ట్రపతి పాలనపై చాకో
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన చివరి అస్త్రమని ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో గురువారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాజా పరిస్థితుల పైన ఆయన స్పందించారు. ఎపిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని చెప్పారు. శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అన్నారు.
శాంతిభద్రతలు కాపాడాలని తాను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఇతరత్రా మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పిసి చాకో ఈ సందర్భంగా చెప్పారు.
నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: మైసూరా రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత మైసూరా రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెసు పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
కేంద్రం పునరాలోచించాలని, కేబినెట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. మంత్రుల బృందంలో కేబినెట్ ప్రకటనను పూర్తి చేసే వాళ్లే ఉన్నారని చెప్పారు. విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.