గుంటూరు:విదేశీయులపై దౌర్జన్యం ఘటనలో..ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
గుంటూరు: విదేశీయులతో దురుసుగా వ్యవహరించి డబ్బులు వసూలు చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరులో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ నెలలో ఒక పెళ్లి వేడుక కోసమని గుంటూరు వచ్చిన విదేశీయులతో వారి వివరాలు తెలుసుకునే పేరిట కొంతమంది కానిస్టేబుళ్లు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా భయపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లి వారి రాయబార కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించడంతో...దీనిపై తక్షణం విచారణ చేపట్టిన పోలీస్ శాఖ గుంటూరు అర్బన్ పరిధి ఐడి విభాగం కానిస్టేబుళ్లు మంగళగిరి శ్రీనివాసరావు, రవితేజ,ప్రదీప్ లను సస్పెండ్ చేసింది.
డిసెంబర్ నెలలో గుంటూరు మండలం చౌడవరంకు చెందిన ఒక ఎయిర్ హోస్ట్ వివాహానికి యుకెకు చెందిన సుమారు 40 మంది హాజరయ్యారు.అందులో నలుగురు గుంటూరు నగరంలోని ఓ హోటల్లో బస జేశారు. నిబంధనల ప్రకారం విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు వారు సంబంధిత జిల్లా కేంద్రంలో నిఘా విభాగానికి తమ వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ విదేశీయుల సమాచారం వివరాలు తెలుసుకునేందుకు ఆ హోటల్ కు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసకుమార్ కు, ఇలా పెళ్లి వేడుక కోసం మొత్తం 40 మంది విదేశీయులు వచ్చి, ఒక ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాసకుమార్ తన సహచరులైన రవితేజ,ప్రదీప్ లను వెంటబెట్టుకొని విదేశీయులు బస చేసిన ఇంటివద్దకు వెళ్లారు.
విదేశీయులు వివాహ వేడుకల కోసం వెళుతుండగా వారిని మీ వివరాలు, అందుకు సంబంధించిన నకళ్లు ఇప్పటికిప్పుడు ఇవ్వాలని, ఇచ్చే కదలాలంటూ అనుచితంగా ప్రవర్తించారు. ఆ క్రమంలో వారి నుంచి డబ్బు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. పైగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.దీంతో ఈ పోలీసుల తీరుతో విసిగిపోయిన విదేశీయులు వారి దేశాలకు తిరిగివెళ్లిన తరువాత ఎంబసీల్లో ఫిర్యాదు చెయ్యడంతో ఈ సమాచారం డిజిపికి చేరింది.
ఆయన ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా పరిగణించి విచారణకు ఆదేశించిన క్రమంలో...విదేశీయుల పట్ల ఈ ముగ్గురు పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన విషయం వాస్తవమేనని ధృవీకరించి కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, రవితేజ,ప్రదీప్ లను సస్పెండ్ చేశారు. అయితే ఈ ముగ్గురు పోలీసులు మాత్రం తాము విదేశీయుల నుంచి డబ్బులు తీసుకోలేదని చెబుతున్నట్లు తెలిసింది.