అగ్రిగోల్డ్ భూములు జఫ్తు, చిట్ఫండ్లపై ఏపీలో కొరడా!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్, అభయ గోల్డ్లకు చెందిన ఆస్తులను జఫ్తు చేసింది. ఈ సంస్థల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో సీబీసీఐడీ విచారణ జరుపుతోంది. ఆస్తులను జప్థు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో, ఏపీ వాటి ఆస్తులను జఫ్తు చేసింది. ఆ సంస్థలకు చెందిన వేలాది ఎకరాల భూమిని జఫ్తు చేసింది.
కాగా, చిట్ఫండ్ కంపెనీల మోసాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సర్కారు నిర్ణయించుకుంది. రాత్రికి రాత్రి బోర్డు తిప్పివేసే చిట్ఫండ్ కంపెనీలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు సిఫారసుల మేరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించనుంది.
ఆర్థిక అవినీతి, అక్రమాలపై ఆర్థిక మంత్రి యనమల రామ కృష్ణుడు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కొన్ని సిఫారసులు చేసింది. వాటిని న్యాయ శాఖ పరిశీలనకు పంపించింది. న్యాయ శాఖ సూచనల మేరకు అవ సరమైన మార్పు చేర్పులు చేసి వచ్చే కేబినెట్ భేటీలో ఈ బిల్లు ముసాయిదాలను ఆమోదిస్తారు.
అసెంబ్లీబడ్జె ట్ సమావేశాల్లోనే చట్టం చేయాలని నిర్ణయించారు. డిపాజిటర్ల రక్షణ కోసం 1999లోనే రూపొందించిన ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. మోసాలకు పాల్పడిన చిట్ కంపెనీలు, మనీ సర్క్యులేషన్ సంస్థల తోపాటు భూమిని పెట్టుబడిగా చూపించి మోసాలు చేసే సంస్థల పైనా కేసులు నమోదు చేస్తారు.
వాటి ఆస్తులను వేలం వేసి ఆ సొమ్మును బాధితులకు పంపిణీ చేయనున్నారు. తప్పు చేసిన సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. నిర్వాహకులకు జైలు శిక్షతో పాటు రూ.ఐదు లక్షల వరకూ జరిమానా కూడా విధిస్తారు.