టిటిడి చైర్మన్ పదవి కోసం రాయపాటి, ఇక మీకివ్వనని మురళీ మోహన్కు బాబు ఝలక్
తిరుమల తిరుపతి దేవస్థానం రేసులో ఉన్న ఎంపీలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులు శనివారం వేర్వేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం రేసులో ఉన్న ఎంపీలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులు శనివారం వేర్వేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
టిటిడి చైర్మన్ రేసులో ఇరువురు ఉండటం, వారిద్దరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేసులో మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులతో పాటు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుతో భేటీ అనంతరం మురళీ మోహన్ మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే తానా సభల్లో పాల్గొనేందుకు అనుమతి కోరేందుకు తాను సీఎం చంద్రబాబును కలిశానని చెప్పారు. టిటిడి చైర్మన్ పదవి గురించి మాట్లాడుతూ.. అది తన చిన్న నాటి కల అన్నారు.
కాగా, తనకు టిటిడి పదవి కావాలన్న మురళీ మోహన్కు చంద్రబాబు ఘాటైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. అడిగిన వారందరికీ పదవులు ఇస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు పదవులు ఇవ్వదలుచుకోలేదని చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతమైన నేపథ్యంలో కలిసేందుకు వచ్చానని రాయపాటి అన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడుతుంటే జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే, ఇరువురు నేతలు కూడా టిటిడి చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లుగా తెలుస్తోంది.