ఎర్రచందనం స్మగ్లర్ పట్టివేత: రియల్టర్ దారుణ హత్య
చిత్తూరు/ రాజమండ్రి: పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ హుస్సేన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ ఎర్రచందనం బడా స్మగ్లర్లయిన శేఖర్, షరీఫ్లకు అనుచరుడు.
అతన్ని అరెస్టు చేసిననంతరం కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపూర్లో ఫాంహౌస్లో దాచిన రూ.కోటి విలువైన 3 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈయన ఎక్కడెక్కడ ఎర్రచందనాన్ని దాచిపెట్టారన్న వివరాలను పోలీసులు రాబడుతున్నారు.
అల్తాఫ్ గత ఏడాది కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఈ స్థితిలో అతన్ని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతను పోలీసులకు చిక్కాడు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరం నాగదేవి థియేటర్ సమీపంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని కోర్లంపేట కాలనీకి చెందిన కటికతల వెంకట శేషు (53)గా గుర్తించారు. శేషును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.
వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవల కారణంగానే శేషు హత్యకు గురి కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు.