కృష్ణంరాజు కోసం గుర్తుండిపోయేలా.. ప్రభాస్
ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ పెదనాన్న, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మూలపురుషుల్లో ఒకరైన కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కొవిడ్ అనంతర సమస్యలను ఎదుర్కొంటూ ఆయన కన్నుమూశారు. తాను ఈరోజు పాన్ ఇండియాస్థాయిలో కథానాయకుడిగా ఉండటానికి కారణమైన పెదనాన్న కోసం అందరూ గుర్తుండిపోయేలా మంచిపని చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.
తమ స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణంరాజు, తన తండ్రి సూర్యనారాయణరాజు విగ్రహాలను చేయిస్తున్నారు. ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాలోని కొత్తపేటలో ఉండే ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్కు ఈ బాధ్యతలు అప్పగించారు. వీటిని మొగల్తూరులో ప్రతిష్టించబోతున్నారు. వడయార్ కృష్ణంరాజు విగ్రహాన్ని నాలుగు రోజుల్లో పూర్తిచేశారు. రెబల్ స్టార్ పెదకర్మ రోజు దాన్ని అందజేయనున్నారు. మొగల్తూరులో వీటిని ప్రతిష్టించబోతున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ లోని ఇంట్లో పెద కర్మ రోజు 70 వేలమందికి ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభాస్ ఆహ్వానిస్తున్నారని, సినీ పరిశ్రమలో అందరినీ పిలుస్తున్నారని చెబుతున్నారు.
కృష్ణంరాజు మరణంతో విషాదంలో ఉన్న ప్రభాస్ ను సినిమాలకు సంబంధించిన పనులకు పిలవడం భావ్యం కాదని ఆదిపురుష్ టీం భావిస్తోంది. విజయ దశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఈ వేడుక ప్రభాస్ లేకుండానే జరిగే అవకాశం కనపడుతోంది. టీం కూడా అందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ప్రభాస్ ను ఇటువంటి కార్యక్రమాలకు పిలవడం సరికాదని భావిస్తున్నామన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అదేరోజు వెల్లడి చేయనున్నారు. 2023 సంక్రాంతికి దేశవ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్ పై భారీగా ఆదిపురుష్ ను విడుదల చేయబోతున్నారు.