టీ ఇవ్వాలని ఇందిరా గాంధీ అనుకున్నారు: రేవంత్
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు ప్రాణానికి ఉన్న విలువ తెలంగాణకు చెందిన వేయి మంది యువకుల ప్రాణాలకు లేదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెసు సీమాంధ్ర సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరించవద్దని ఆయన సూచించారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేశారని, తెలంగాణలో రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రంలో కలిసి జీవిస్తూ అబివృద్ధి సాధించవచ్చునని బూర్గుల రామకృష్ణారావు వంటివారు అనుకుని ఉంటారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షరతులతో ఏర్పడిందని, షరతులను కాలరాయడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, దాంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తాము పోరాటాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోవడం వల్లనే 1969లో తెలంగాణ యువకులు నక్సలిజంలోకి వెళ్లారని ఆయన అన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వం 365 మందిని కాల్చి చంపారని, అయినా తాము కక్ష కట్టలేదని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు అత్మత్యాగంతో మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న సీమాంధ్రులు వేయి మంది విద్యార్థులు ఆత్మత్యాగం చేసినా ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములును ఆదర్శంగా చేసుకోవాలని ఆయన అన్నారు.
నిజాం ప్రభువుతో జవహర్ లాల్ నెహ్రూ యథాతథ స్థితికి ఒప్పందం చేసుకున్నారని, హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందని చెప్పారని, తాము బలప్రయోగం చేయబోమని నెహ్రూ చెప్పారని, తెలంగాణకు నెహ్రూయే అన్యాయం చేశారని ఆయన అన్నారు. తమ సీమాంధ్ర మిత్రులు తమ పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
విజయం సాధించినవాళ్లే చరిత్ర రాసుకుంటారని, తెలంగాణవాళ్లు పోరాటం చేసినవాళ్లంతా అమరులయ్యారని ఆయన అన్నారు. అణచివేత, దోపిడీకి గురైన ఏ ప్రాంతాన్నయినా తెలంగాణ అన వచ్చునని ఆయన అన్నారు. అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మొక్కవోని ధైర్యంతో పోరాటం చేశారని ఆయన అన్నారు.
తమ పూర్వులు సమైక్య రాష్ట్రంలో బాగుపడుతామని భావించి ఉండవచ్చునని, అయితే అంత మాత్రాన తాము బానిసలుగా భావించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే కాలరాశారని, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే అంగీకారాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు.
ఐక్యరాజ్యసమితిలో నిజాం వేసిన కేసు పెండింగులో ఉన్నందున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గారని చరిత్ర చెబుతోందని, ఇందిరా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఆదేశాలు కూడా జారీ చేశారని, అయితే ఐక్య రాజ్యసమితిలోని కేసు వల్లనే వెనక్కి వెళ్లారని రేవంత్ రెడ్డి వివరించారు. అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలను ఆయన ఉటంకించారు.
ఇందిరా గాంధీ విషయంలో సభను కిరణ్ కుమార్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. అందుకు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడే రెండు రాష్ట్రాలు ఏర్పడి ఉంటే తమకు మేలు జరిగి ఉండేదని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రలో వేల ఉల్లంఘనలు జరిగాయని, ఉర్దూ అధికార భాషగా ఉంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణవాళ్లు అధికారుల స్థాయిలో ఉండేవాళ్లని, తెలుగును అధికార భాషగా చేయడం వల్ల తెలంగాణవాళ్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారు నాలుగో తరగతి ఉద్యోగుల స్థాయికి మాత్రమే పరిమితమయ్యారని, ఆంధ్రవాళ్లు అధికారులుగా వచ్చారని ఆయన అన్నారు. తెలుగునాడు అని కాకుండా సమైక్యాంధ్రకు పేరు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ అని పెట్టడంలోనే ఆధిపత్యం ధోరణి ఉందని ఆయన అన్నారు.
ఆకలితోనైనా చస్తాం గానీ తాము సీమాంధ్రతో కలిసి ఉండబోమని రేవంత్ రెడ్డి అన్నారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఇతర రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే, కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తుంటే ప్రశ్నించకుండా తెలంగాణవాళ్లను అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే బూర్గుల పదవిని త్యాగం చేశారని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు.