అనారోగ్యంతో ఉన్న రోజాను అరెస్టు చేస్తారా, కరణంతో లింకేమిటి: జగన్
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యురాలు రోజా గత 9 రోజులుగా అనారోగ్యంతో అస్పత్రిలో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, అలాంటి మనిషిని అరెస్టు చేశ్తారా అని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం సభ వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లాడురు.
గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని, రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని, ఇది తప్పుడు సంప్రదాయమని ఆయన అన్నారు. కరణం బలరాం వ్యవహారానికి, రోజా సస్పెన్షన్కు సంబంధం ఏమిటని ఆయన అడిగారు. బలరాం విషయంలో నిబంధలన్నీ పాటించారని, కరణం బలరాం అప్పట్లో నేరుగా స్పీకర్ను దూషించారని ఆయన గుర్తు చేశారు.
పైగా కరణం బలరాం ఉదంతాన్ని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేశారని, ఈ సందర్భంగా జరిపిన విచారణకు కరణం బలరాం హాజరు కాలేదని, ఆ తర్వాత మాత్రమే కరణం బలరాంను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడా తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వస్తుంటే పది మంది టిడిపి ఎమ్మెల్యేలు తిట్టారని ఆయన చెప్పారు. స్పీకర్ సమక్షంలో సభలోనే తిట్టినా పట్టించుకోరా అని ఆయన అడిగారు. సెక్స్ రాకెట్ అంశంపై చర్చ జరగకుండా ఈ అంశం తెర మీదికి వచ్చే విధంగా కుయుక్తి పన్నారని ఆయన అన్నారు. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను సోమవారానికి వాయిదా వేశారు.