సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 38మంది అరెస్ట్, చూసేందుకు ఎగబడ్డ జనం
చిత్తూరు: పేదరికం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కొందరు యువతులు వేరే దారిలేక వ్యభిచారకూపంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. మరికొందర్ని బలవంతంగా వేశ్యలుగా మారుస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఇలా వారి ప్రమేయం లేకుండానే మహిళలు శరీరాన్ని అమ్ముకునే వ్యాపార కూపాల్లోకి నెట్టబడుతున్నారు. తాజాగా, చిత్తూరులో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
సోమవారం జిల్లాలో ని పలు ప్రాంతాల్లో సీఐ రుషీకేశవ ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ సెక్స్ రాకెట్ బయట పడింది. ఇందులో భాగంగా 38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు, పలువురు మహిళలను అరెస్టు చేశారు.
మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యభిచారంపై కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు.. సోమవారం ములకలచెరువు ఇందిరాకాలనీలోని ఓ మహిళ ఇంటిపై సీఐ రుషీకేశవ, ఎస్ఐలు ఈశ్వరయ్య, నరేష్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఆ మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి సమాచారం మేరకు.. మదనపల్లె పట్టణంలోని పలు వ్యభిచారగృహాలపై దాడులు నిర్వహించారు. 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది మహిళలు, యువతులను అరెస్టు చేసి రూ.40వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో ములకలచెరువు, మదనపల్లె, కురబలకోట మండలం అంగళ్లు, అనంతపురం జిల్లా కదిరి, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన వ్యభిచారగృహ నిర్వాహకులు బూచిపల్లె ఉమాదేవి, బోనాల అమ్మాజీ, సావిత్రమ్మ, తమిళ గౌరమ్మ, చింతల అరుణ, అంగళ్లు వాణి, దొమ్మిరిరెడ్డి విజయ, దొమ్మిరి లక్ష్మీదేవి, పటాన అమ్మాజాన, షేక్యాస్మిన్ భాను అలియాస్ రేష్మా, గొందిపల్లె మంగమ్మ, అమరావతి, లక్ష్మీదేవి ఉన్నారు.
కాగా, మదనపల్లెకు చెందిన బ్రోకర్లు సంతోష్, సురేష్, అనిల్, ముబారక్, కృష్ణారెడ్డి తదితరులు పట్టుబడ్డారు. వీరందరూ పదేళ్లుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ 500 మందికి పైగా అమాయక మహిళలను ఈ ఊబిలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు రూ.వెయ్యి ఇస్తూ, వారి ద్వారా నిర్వాహకులు నిత్యం రూ.6వేల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడైందన్నారు.
సెక్స్ రాకెట్లో పెద్దల హస్తముందనీ, దీనిపై దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కాగా, సీఐ రుషీకేశవ, ఎస్ఐలు, సిబ్బందికి ఎస్పీ శ్రీనివాస్ త్వరలోనే రివార్డు ప్రకటిస్తారని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
చూసేందుకు ఎగబడ్డ జనం
వ్యభిచార గృహంపై దాడి, అరెస్టుల విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో స్టేషన్ వద్దకు తరలివచ్చారు. నిందితులను చూడడానికి ఇళ్లపైకెక్కి మరీ ఎగబడ్డారు.