మంతనాలు: టిఆర్ఎస్ వైపు జగన్ పార్టీ నేతల చూపు!
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా కొత్తగూడెంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వెంకటరావును వీరు కలిసినట్లు సమాచారం.
కాంగ్రెస్లో ఇమడలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకుడు, మాజీ మండల ప్రజాప్రతినిధితోపాటు ఇరువురు తాజా ప్రజాప్రతినిధులు గోడ దూకేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరికి పార్టీల ఆదరణ కొరవడడంతోపాటు జిల్లా నాయకత్వం సైతం వీరికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే పార్టీ మారేందుకు ప్రయత్నం జరుగుతున్న విషయంపై ప్రచారం జరుగుతోంది.
నిత్యం అలక వహిస్తున్న ముఖ్యనాయకుడు పట్ల ఎమ్మెల్యే, ఎంపీ సైతం ఆగ్రహంగా ఉన్నారని, వారు కూడా అస్మమతి నాయకుడిని వదిలించుకుని మండలంలోని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జడ్పిటిసి కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్కు పార్టీ పూర్తి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్లోకి రాకుండా ఎమ్మెల్యే జలగం వర్గం అడ్డుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఈ నాయకుల వల్ల ఇబ్బందులు పడ్డ జలగం సామాజిక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకోవద్దని, వారు టిఆర్ఎస్ పార్టీలో చేరితే వర్గాలు పుట్టుకొస్తాయని జలగం వెంకటరావుకు వివరించినట్లు తెలిసింది.