కన్నాకు పదవా?: బీజేపీలో రాజీనామా కలకలం, సోము వీర్రాజు ఆగ్రహం, ట్విస్ట్.. నాడే అమిత్ షా హామీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పార్టీ చీఫ్గా కన్నా లక్ష్మీనారాయణను నియమించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కలకలం చోటు చేసుకుంది. కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు.
చదవండి: ముద్రగడతో కన్నా లక్ష్మీనారాయణ ఏకాంత చర్చలు, బాబుపై 'కాపు' ఆగ్రహం
బీజేపీ జాతీయ నేతలతో భేటీకి ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. సోము వీర్రాజు మాత్రం దూరంగా ఉన్నారు. ఆయన కన్నాతో పాటు వెళ్లాల్సి ఉంది. కానీ కన్నాకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడంతో ఆయన అలిగారని తెలుస్తోంది. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. కన్నాను ఏపీ పార్టీ చీఫ్గా, సోము వీర్రాజును ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలుఅప్పగించిన విషయం తెలిసిందే.

పార్టీ చీఫ్గా కన్నా, జిల్లా అధ్యక్షుల రాజీనామా
కన్నా లక్ష్మీనారాయణను పార్టీ చీఫ్గా చేసిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. తూర్పు గోదావరి, రాజమహేంద్రం నగర అధ్యక్షులు తమ తమ పదవులకు రాజీనామాలను పంపించారు. పార్టీ మారి నిన్న గాక మొన్న వచ్చిన వ్యక్తికి అత్యున్నత పదవి ఇవ్వడం ఏమిటని అంటున్నారు.

సోము వీర్రాజు అందుబాటులో లేరా?
కన్నాకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడంతో సోము వీర్రాజు కినుక వహించారు. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. సాయంత్రం ఎనిమిది గంటల సమయం నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. పార్టీ చీఫ్ పదవి తనకు వస్తుందని సోము వీర్రాజు చాలా కాలంగా భావిస్తున్నారు.

వైసీపీలోకి వెళ్తారని.. అంతలోనే
కాగా, కన్నా లక్మీనారాయణ ఇటీవల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన చేరిక వాయిదా పడింది. కానీ హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్గా చేశారు. నాడు పార్టీ చీఫ్గా చేయనందుకే ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావించారని, కానీ అధిష్టానం నుంచి హామీ వచ్చాక ఆగిపోయారని, ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

కన్నా నేపథ్యం ఇదీ
కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు నగరంలో 1955 ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు రంగయ్య, మస్తానమ్మ. భార్య విజయలక్ష్మి. ఇద్దరు కుమారులు.. నాగరాజు, ఫణీంద్ర. ఏయూ నుంచి బీకాం డిగ్రీ పొందారు. స్వతహాగా వెయిట్ లిఫ్టర్. కాలేజీ రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో చేరారు. పెదకూరపాడు నుంచి 1989 నంచి 2004 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి గెలిచారు. 1991 నుంచి 1994 వరకు, 2004 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

ఆ రోజే అమిత్ షా హామీ
బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మీకే ఇస్తామని అమిత్ షా నుంచి మూడు వారాల క్రితమే కన్నాకు హామీ లభించినట్లుగా ప్రచారం సాగుతోంది. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో గత నెల 25వ తేదీన కన్నా వైసీపీలో చేరాలని భావించారు. ఆ తర్వాత అనారోగ్యం పేరుతో తగ్గారు. వైసీపీతో చర్చలు జరిపి పార్టీ మారేందుకు కూడా ముహూర్తం కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమిత్ షా నాడు హామీ ఇవ్వడంతోనే తగ్గినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా స్వయంగా కన్నాకు ఫోన్ చేసి కొన్ని రోజులు వేచి చూడాలని చెబుతూ, పార్టీ అధ్యక్ష పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఫోన్ చేయడం వల్లే వైసీపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని కన్నా వాయిదా వేసుకున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications