కౌన్సెలింగ్ పూర్తి చేయండి, రాజకీయాలొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ నెల 31వ తేదీ లోపు ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. విద్యార్థుల భవిష్యత్తు తోటి రాజకీయాలు వద్దని సుప్రీం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికింది. సెప్టెంబరు మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఎంసెట్ కౌన్సెలింగ్ అంశం సుప్రీం కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్ కోసం అక్టోబర్ వరకు సమయమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే, ఏపీ ప్రభుత్వం వెంటనే కౌన్సెలింగ్ కోరింది.
దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు సోమవారం.. ఆగస్టు 31వ తేదీ లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది. అడ్మిషన్ల పైన రాజకీయ ప్రభావం ఉండవద్దని సూచించింది. స్థానికత పైన ఉమ్మడి రాష్ట్రంలోని నిబంధనలే వర్తిస్తాయని చెప్పింది. రాష్ట్ర విభజనకు, విద్యార్థులకు సంబంధం లేదని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు పైన రాజకీయాలు వద్దని హితవు పలికింది.
సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాల్సి ఉందని తెలిపింది. సమయం ఇస్తే సమస్యలు పెరుగుతాయని తెలిపింది. ప్రవేశాల పైన రాజకీయ ప్రభావం ఏమాత్రం ఉండవద్దంది. విద్యార్థుల పైన విభజన ప్రభావం పడవద్దంది. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ప్రకారం కౌన్సెలింగ్కు వెళ్లాలని ఆదేశించింది. కాగా, పూర్తి స్థాయి తీర్పును సోమవారం (11న) సుప్రీం కోర్టు వెల్లడించనుంది.