హైదరాబాద్ టెక్కీ సల్మాన్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు?
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు బయలుదేరి పోలీసులకు చిక్కిన హైదరాబాద్ టెక్కీ సల్మాన్ మొయినుద్దీన్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఉగ్రవాద వ్యవహారం కావడంతో పోలీసులు సల్మాన్ కేసు వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ఐఎస్ కదలికలు పెరిగిపోవడంతో ఈ గ్రూపునకు సంబంధించి ఏ చిన్న లింకు దొరికినా అన్ని దేశాలు వివరాలు సేకరిస్తున్నాయి.
అందులో భాగంగా సల్మాన్ వ్యవహారాన్ని ఇతర దేశాలు ఆరా తీసే అవకాశం ఉండడంతో పోలీసులు సల్మాన్ వ్యవహారాన్ని ప్రత్యేకంగా తీసుకుని కేసు మూలాల్లోకి వెళ్లి విచారించాలని భావిస్తున్నారు. అరెస్ట్ అనంతరం నుంచి సల్మాన్ నుంచి పోలీసులు ఐఎస్ఐఎస్కు సంబంధించి కొంత కీలక సమాచారాన్ని సేకరించారు. సల్మాన్ ఇంకెమైనా దాచిపెట్టి ఉంటాడా అన్న కోణంలో కూమా పోలీసులు ఆరా తీస్తున్నారు.
అందులో భాగంగా సల్మాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి (ఎఫ్ఎస్ఎల్)కు పంపించాలని నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో వాటిని ఎఫ్ఎస్ఎల్కు అప్పగించే అవకాశాలున్నాయి. సల్మాన్ మెయిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, మేసేజ్ల రూపేణా ఇప్పటివరకు సల్మాన్ జరిపిన వ్యవహారాల నిగ్గు తేల్చాల్సిందిగా ఎఫ్ఎస్ఎల్ను కోరనున్నారు.
సల్మాన్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను డీకోడ్ చేస్తే ఏమైనా కీలక సమాచారం లభించే అవకాశాలూ లేకపోలేదు. ఇలాఉండగా సల్మాన్ మెయినుద్దీన్ను మరింత లోతుగా విచారించేందుకు వీలుగా పోలీసులు అతడ్ని కస్టడిలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన సల్మాన్ సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్కు చేరుకుని అక్కడి నుంచి తన గర్ల్ఫ్రెండ్తో సహా టర్కీ మీదుగా సిరియా చెక్కేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.
అతని వద్ద నుంచి లాప్టాప్, రెండు సెల్ఫోన్లు, పాస్పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్సైట్ల ద్వారా ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైదరాబాద్లోని బజార్ఘట్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (32) బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ టెక్సాస్లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాడు.