తెలంగాణ విమోచన దినం: జెండా ఎగిరేసిన చంద్రబాబు
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను స్వర్గీయ నందమూరి తారక రామారావే తొలగించారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘటన టిడిపిదే అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు టిడిపితోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదు చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టిడిపి మొదటి నుండి వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెరాస భవన్లో..
తెలంగాణ భవనంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ విలీనం దినం సందర్భంగా నల్గొండ ఎస్పీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా, సెప్టెంబర్ 17ను కొందరు తెలంగాణ విలీన దినంగా, మరికొందరు తెలంగాణ విమోచన దినంగా పేర్కొంటారు.