జగన్ పార్టీకి కోనేరు ప్రసాద్ రాజీనామా వెనక పెద్ద కథే..
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కోనేరు ప్రసాద్ రాజీనామా చేయడం వెనక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. మీడియాలో వచ్చిన వార్తాకథనాలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
బీచ్ మినరల్స్ ను సేకరించడంలో ప్రసిద్ధి గాంచిన ట్రైమెక్స్ గ్రూప్ పై ప్రభుత్వం విచారణకు జారీ చేసిన ఆదేశాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైనట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థలో వార్తాకథనం వచ్చింది.
ట్రైమెక్స్ గ్రూప్ అధినేత అయిన కోనేరు ప్రసాద్ ఒకప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే విషయం తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు దగ్గరయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల్లో జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు ప్రసాద్ సీబీఐ వేసిన చార్జిషీట్లో ఆరో నిందితుడుగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో విజయవాడ లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని చేతిలో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
శ్రీకాకుళంలో బీచ్ మినరల్స్ ను వెలికితీసేందుకు బీచ్ శాండ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ట్రైమెక్స్ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ ఫ్యాక్టరీ చాలా కాలం క్రితమే పని ప్రారంభించింది. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వంతో సుమారు 2 వేల 500 కోట్ల రూపాయలకు బీచ్ మినరల్స్ తీసేందుకు భావనపాడు, కళింగపట్నంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బీచ్ శాండ్ నుంచి మినరల్స్ తీసే విధానంలో అవకతవకలు జరిగాయని, విశాఖపట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని దీని పై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో కోనేరు ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు.
అసెంబ్లీలో విచారణకు ఆదేశించిన పది రోజుల్లోనే కోనేరు ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపారు. క్రియాశీలక రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో చెప్పారు.