చంద్రబాబు గారూ...ఇది పద్దతేనా?...ఇవే కదా ద్వంద విధానాలంటే:సిపిఎం
Recommended Video
అనంతపురం:అనంతపురంలో రైతుల కోసం సిపిఎం నేతలు చేస్తున్న దీక్షలను రెండో రోజే అకారణంగా పోలీసులతో అరెస్ట్ చేయించి భగ్నం చేయడంపై టిడిపి ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
టిడిపి ప్రభుత్వం ద్వంద విధానాలతో, నియంతృత్వ పోకడలతో విపక్షాలను అణచివేయాలని చూస్తోందని, అందుకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపి దీక్ష చేస్తుంటే ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతూనే రాజకీయ ప్రయోజనాల కోసం దీక్ష కొనసాగేలా సహకరిస్తున్న టిడిపి ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల నేతలను మాత్రం దీక్షలు చేయనీయకుండా బలవంతంగా అణచివేస్తోందని సిపిఎం నేతలు విమర్శిస్తున్నారు.
అసలు...ఏం జరిగిందంటే?
అనంతపురంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 8 మంది సిపిఎం నేతలు ఆమరణ నిరాహారదీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా దీక్షలు చేస్తున్న సిపిఎం నేతలపై గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా పోలీసులు విరుచుకుపడ్డారు. రాత్రి రెండుగంటల ప్రాంతంలో దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు అనూహ్యంగా శిబిరంపై విరుచుకుపడి బలవంతపు అరెస్ట్లకు దిగారు. నిద్రపోతున్న వారిని కనీసం లేపకుండానే అలాగే మోసుకొంటూ తీసుకెళ్లి వ్యాన్ల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఆకస్మిక చర్య నుండి దీక్షలో ఉన్నవారు తేరుకునే లోపే ఆస్పత్రికి తరలించి భంగం చేయడానికి ప్రయత్నించారు.
కనీసం...కారణం చెప్పలేదు
అయితే పార్టీల నేతలు దీక్షలు చేయడం...శాంతి భద్రతలకు భంగం కలుగుతుంటేనే...ఆరోగ్యం క్షీణిస్తుంటేనో ఆ దీక్షలను ప్రభుత్వం భగ్నం చేసి వారిని అరెస్ట్ చేయడం, అవసరమైతే ఆస్పత్రికి తరలించడమో చేస్తారు. అయితే...అనంతపురంలో రైతాంగ సమస్యలపై సిపిఎం దీక్ష ఆరంభించి రెండు రోజులు మాత్రమే అవుతోంది. ఎక్కడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లలేదు...దీక్ష ఆరంభించి రెండు రోజులే అయినందున 8 మందిలో ఎవరి ఆరోగ్యం క్షీణించలేదు. అయినాసరే పోలీసులు విరుచుకుపడి బలవంతంగా అరెస్ట్ చేసి దీక్ష భగ్నం చేసేశారు.
కారణం అడిగితే...మౌనమే సమాధానం
హఠాత్తుగా తమని అరెస్ట్ చేస్తున్న పోలీసులను సిపిఎం నేతలు ఇదే విషయమై నిలదీస్తే వారి నుంచి ఏ సమాధానం లేదు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..మేము మా ఆరోగ్యం బాగానే ఉందికదా?...మేము ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగానే దీక్ష చేస్తున్నాము కదా?...అంటూ పోలీసులను ప్రశ్నించినా మౌనమే సమాధానం అయింది. దీంతో ప్రభుత్వం కావాలనే ఈ దీక్షను భగ్నం చేసిందని సిపిఎం నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు కడప స్టీలు ప్లాంట్ కోసం టిడిపి ఎంపి సిఎం రమేష్ దీక్ష చేస్తుంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూనే దీక్ష భగ్నం చేయని టిడిపి ప్రభుత్వం తమ దీక్షని ఇలా బలవంతంగా భగ్నం చేయడం దారుణమని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవే కదా...ద్వంద ప్రమాణాలంటే
ఒకవైపు టిడిపి ఎంపి దీక్ష కొనసాగుతుండటం, మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే వివిధ రకాల దీక్షలు చేస్తూ, కొత్త కొత్త దీక్షలని ప్రకటిస్తూ, తాజాగా శుక్రవారం కాకినాడలో చేసే దీక్ష కోసం భారీ ప్రచారం చేయించుకుంటున్న సిఎం చంద్రబాబు...రైతు సమస్యలపై తాము చేస్తున్న దీక్షను అకారణంగా భగ్నం చేయడం... గురువారం జరిగిన ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా సిపిఎం నేతలను గృహనిర్భందం చేయడం వంటి చర్యలు టిడిపి ప్రభుత్వం ద్వంద ప్రమాణాలకు,నియంతృత్వ పోకడలకు నిఖార్సైన రుజువులుగా సిపిఎం నేతలు అభివర్ణిస్తున్నారు. అధికారంలో ఉండి కూడా తామే దీక్షలు చేస్తూ...ఇతర పార్టీల వారిని నిరసన ఆందోళన తెలపకుండా అడ్డకోవడం టిడిపి ప్రభుత్వం కుటిలత్వానికి నిదర్శనంగా సిపిఎం నేతలు అభివర్ణిస్తున్నారు.
అసలు కారణం...అదేనా?
శుక్రవారం కాకినాడలో సిఎం చంద్రబాబు చేసే దీక్ష కోసమే తమ దీక్షను భగ్నం చేసినట్లుందని, రాష్ట్రంలో తాము తప్ప మరెవరూ దీక్షలు చేయకూడదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. జనం తమ పార్టీ దీక్షల గురించే చెప్పుకోవాలి...వాటి ద్వారా తామే రాజకీయ ప్రయోజనం పొందాలి...ప్రతిపక్షాలు చేసే దీక్షల గురించి ప్రజలు చర్చించుకోరాదనే వైఖరితో టిడిపి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, అందుకు తగిన సమయంలో వీరికి సరైన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.