అమరావతికి వేయి కోట్లు, ప్రత్యేక హోదాపై రాజకీయం: వెంకయ్య
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెసు రాజకీయం చేస్తోందని, ఎపి ప్రతిపాదిత రాజధాని అమరావతికి వేయి కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. దేశాన్ని కాంగ్రెస్ అస్తవ్యస్థం చేసిందని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లాలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీకి శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అశోక గజపతి రాజు, సుజనా చౌదరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. విభజనతో లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కృష్ణా జలాలు తరలించడం ఖాయమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. తర్వలోనే ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు పన్ను మినహాయింపును లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధ్యాసంస్థలను ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో కేంద్ర రక్షణ శాఖ శిక్షణా కేంద్రం, కర్నూలు జిల్లాలో రక్షణ కర్మాగారం ఏర్పాటవుతుందని వెంకయ్య చెప్పారు. మే నెలలో విజయవాడ, గుంటూరు మధ్య ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 100 కోట్లతో మే నెలలో తిరుపతిలో ఇండియన్ కల్లరీ ఇనిస్టిట్యూట్కు శంకుస్థాపన చేస్తానని వెంకయ్య తెలిపారు. గిరిజనుల కోసం విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెంకయ్య తెలిపారు.
హామీలను అమలు చేస్తామని జైట్లీ
విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో తప్పకుండా పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వెన్నుదన్నుగా ఉందన్నారు. ఏయే కార్యక్రమాల వల్ల జిల్లా అభివృద్ధి చెందుతుందో అలాంటివి చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయన్నున్నట్లు చెప్పారు. జిల్లాలోసాగు,తాగు నీటి కొరత తీర్చేందుకు రాష్ర్టానికి కేంద్రం సహకారం అందిస్తుందని జైట్లీ స్పష్టం చేశారు.
అనంతపురానికి ఎయిర్పోర్టు దగ్గరగా ఉన్నందన చాలా పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉందని చంద్రబాబు తెలియజేశారన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలను తీసుకువచ్చేందుకు, ప్రజల అభివృద్ధికి కేంద్రం నిరంతం ఆలోచిస్తోందని అందులో భాగంగానే ఈ జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేసామని కేంద్రఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు.