టీ హెచ్చరికలు: జగన్ సమైక్య సభకు గట్టి భద్రత
హైదరాబాద్: తెలంగాణ గ్రూపులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ నెల 26వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం చెప్పారు. జగన్ సభను అడ్డుకుంటామని తెలంగాణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి ప్రయత్నాలు అడ్డుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు అనురాగ్ శర్మ చెప్పారు. 16 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను, 34 ప్లాటూన్ల ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు బలగాలను, 1,800 సివిల్ ఫోర్స్ను రంగంలోకి దింపుతున్నారు. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి నగర పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారు.
రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నాయని, కొంత వ్యతిరేకించవచ్చునని, అయితే తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, తాము కొన్ని గ్రూపులతో మాట్లాడుతున్నామని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూస్తామని అనురాగ్ శర్మ చెప్పారు.
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. సభా నిర్వహణకు పోలీసులు 18 షరతులు విధించారు.
కాగా, సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి వైయస్ జగన్ జిల్లాలవారీగా నేతలతో సమీక్ష, నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులతో ఆయన చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర నినాదం భుజాన వేసుకోవడంతో తెలంగాణలో పార్టీ దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి ఉంది. ఈ స్థితిలో కొంత మందిని తన వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.