పుష్కరాల్లో విషాదం: నీటి ఉధృతి, ఐదుగురు విద్యార్థుల మృతి
విజయవాడ: ఏపీలోని కృష్ణా పుష్కరాల్లో మంగళవారం నాడు అపశృతి దొర్లింది. ఈ రోజుకు పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదు కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం జిడుగు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఇక్కడ నీరు వేగంగా ప్రవహిస్తోంది.
వీరు నందిగామ ప్రాంతం నుంచి వచ్చారని తెలుస్తోంది. గల్లంతైన వారిని హరీశ్, గోపిరెడ్డి, నగేష్, లోకేష్, హరిగోపిలుగా గుర్తించారు. విషయం తెలిసిన ఎమర్జెన్సీ టీం.. వారి కోసం నదిలో గాలిస్తోంది. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో, వీరు దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఇద్దరి మృతదేహాలు లభ్యం
గల్లంతైన వారిలో లోకేష్ది నందిగామ, నగేష్ది జయంతి, గోపిరెడ్డితి చెరుకుపాలెం, హరీష్ది రాయనపాడు అని తెలుస్తోంది. వీరంతా చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థులు. గజ ఈతగాళ్లతో విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఒకరి కోసం గాలిస్తున్నారు.
విద్యార్థులు తిగిన చోట ఘాట్ లేదు
ఈ ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగిన చోట ఘాట్ లేదు. మిత్రులంతా స్నానం చేసేందుకు వచ్చి నదిలో మునిగి మృతి చెందారు.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. కొందరు విద్యార్థులు ఇక్కడకు మోటారు బైక్ పైన వచ్చారని, ఇక్కడి నది ఒడ్డున ఎవరూ సంచరించరని చెప్పారు. వీరు నదిలో దిగేందుకు ప్రయత్నించారని చెప్పారు. నదిలో నీరు చాలా వేగంగా ప్రవహిస్తోందని, అలాగే నదిలో శాండ్ రీచ్లు ఉంటాయని, కాబట్టి ఎవరూ ఘాట్లు లేనిచోట నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఘాట్లు లేని చోటకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు. ఘాట్ల వద్ద నదిలో చిక్కుకుపోయినా అక్కడ ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే స్పందిస్తారని చెప్పారు. కాగా, జిడుగు ప్రాంతంలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు కూడా ఎవరూ నీటిలోకి దిగవద్దని సూచిస్తున్నారు.