పవన్ కల్యాణ్కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రశ్నలు: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గాలికే...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తన వ్యాఖ్యలకు పదును పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మిగతా పార్టీలకు వ్యతిరేకంగా ఆయన తన విశ్లేషణను పండించారు.
ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దూరం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కల్యాణ్కు ప్రశ్నలు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తలపెట్టిన థర్డ్ ప్రంట్పై అక్షరాస్త్రాలు వదిలారు.
జగన్ అవిశ్వాస తీర్మానంపై...
జగన్ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం వల్ల ఏమీ లాభం లేదని, వీగిపోయే తీర్మానం వల్ల ఏం వస్తుందో జగన్కే తెలియాలని వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి సోమవారం తాను రాసిన కాలమ్లో అన్నారు. మిత్రపక్షాలకు చెందిన మంత్రులే రాజీనామా చేసినా స్పందించని మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టినా, ఏప్రిల్ 6వ తేదీ తర్వాత ఎంపీలతో రాజీనామాలు చేయించినా స్పందిస్తుందా అని అడిగారు. అంటే, ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ తీసుకున్న కార్యక్రమాలేవీ ఫలితాలు ఇవ్వబోవని తేల్చేశారు. జగన్ది ఏ నాటకంగా ఆయన తేల్చేశారు.
సేఫ్ జోన్లో చంద్రబాబు
కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించడం ద్వారా చంద్రబాబు సేఫ్ జోన్లోకి చేరుకున్నారని వేమూరి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు ప్రజల్లో భావోద్వేగాలు చెలరేగినప్పుడు వాస్తవాలకు, హేతుబద్దతకు చోటు ఉండదని, ఇప్పుడు అదే జరుగుతోందని, రాష్ట్ర ప్రజలు బిజెపిపై మండిపడుతున్నారని, ఆ మంటలకు తమకు అంటకోకూడదని తెలుగుదేశం పార్టీ కేంద్రం ప్రభుత్వం నుంచి తప్పుకుందని, దీంతో చంద్రబాబు సేఫ్ జోన్లోకి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. సేఫ్ జోన్లోకి చేరుకున్న చంద్రబాబును చిక్కుల్లోకి తోయడానికి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన రాశారు. జగన్ అనవసరంగా టిడిపి కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారని ఆయన అభిప్రాయపడుతున్నట్లు ఉన్నారు.
జగన్కు అవకాశం ఇచ్చింది...
ప్రస్తుత పరిణామాలకు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షమే కారణమని కేంద్ర మంత్రి అనంత కుమార్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ బిజెపిని వేమూరి రాధాకృష్ణ ఉతికి ఆరేశారు. జగన్కు ఆ అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వమేనని ఆయన నిందించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి ఏడాది గడిచినా అమలు చేయకపోవడమే ఇందుకు కారణమని తప్పు పట్టారు. ప్యాకేజీ గురించి కేంద్ర బడ్జెట్లో ప్రకటించి ఉంటే సరిపోయేదని, అలా ప్రకటించకపోవడం వల్ల మిత్రబంధం తెగిపోవడమే కాకుండా రాష్ట్రం కూడా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ఏం చేస్తారు...
రెండు రోజుల క్రితం అరుణ్ జైట్లీ చెప్పినట్లు ప్యాకేజీ అయినా ఇప్పుడు అమలు చేస్తారా అని రాధాకృష్ణ ప్రశ్నిస్తూ తన మరిన్ని ప్రశ్నలను పవన్ కల్యాణ్పైకి ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదాను సెంటిమెంటుగా మార్చిన వాళ్లు ఇప్పుడు ప్యాకేజీనైనా అమలు చేయించడానికి బాధ్యత తీసుకుంటారా, నిజ నిర్ధారణ కమిటీ పేరు మీద హడావిడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారని అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవని అన్నారు. కానీ బిజెపి, టిడిపిలు హామీలను అమలు చేయకపోతే ప్రశ్నిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించనప్పుడు పవన్ కల్యాణ్ ఎలా అమలు చేయిస్తారనేది ప్రశ్న.
కుమారుడికి అధికారం కోసమే...
బిజెపితో విభేదాలు మరింత ముదిరితే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్పై దృష్టి సారిస్తారని, వివిద పార్టీలను కూడగట్టడం ఆయనకు పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించి వేమూరి రాధాకృష్ణ తన కుమారుడు కేటీఆర్కు అధికారాన్ని కట్టబెట్టడానికి థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని తేల్చేశారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా అది కేసీఆర్కు ఉపయోగపడిందని ఆయన విశ్లేషించారు. అయితే, థర్డ్ ఫ్రంట్ను నడిపించడంలో కేసీఆర్ విఫలమవుతారని ఆయన చెప్పకనే చెప్పారు.