వరుస వివాదాల నేపథ్యంలో...దుర్గగుడి ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం:ఈవో బదిలీ!
విజయవాడ:కారణాలేమైనప్పటికీ వరుస వివాదాలతో అప్రతిష్ట పాలవుతున్న దుర్గగుడి పాలనా తీరును ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నడు బిగించింది. ఇందులో భాగంగా ఈవో పద్మకుమారిని ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది.
ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది. గతంలో వివాదాల విషయం అటుంచితే దుర్గ గుడిలో తాంత్రిక పూజల ఆరోపణల నుంచి ఈ ఆలయం కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొనివుంటోంది. తాజాగా ఆషాడ మాసం సారె ఇచ్చే సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడం పెను ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకుంది.

ఈవో బదిలీ...నియామకం
దుర్గ గుడిలో వరుస వివాదాల నేపథ్యంలో ప్రస్తుత ఈవో పద్మపై వేటుపడింది. ఆమెని బ్రాహ్మణకార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా దేవాదాయశాఖ ఇన్చార్జ్ కమిషనర్గా కూడా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బదిలీ అయిన పద్మస్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు. ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ రాష్ట్రానికి డిప్యూటేషన్పై రాగా...ఈమె గతంలోనే దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు వచ్చాయి. అవి అప్పుడు వాస్తవరూపం దాల్చకపోయినా ఇప్పుడు సాధ్యపడింది.

అంతకుముందు...సభ్యురాలిపై వేటు
మరోవైపు ఆషాడ మాసం సారె ఇచ్చే సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడంపై మీడియాలో వరుస కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రాధమిక విచారణతో పాటు దేవాదాయశాఖ అంతర్గత విచారణలోనూ ఆ చీరను పాలకమండలి సభ్యురాలు సూర్యలతకుమారి తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయిందని తెలిసింది. దీంతో గురువారం రాత్రి దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా సూర్యలతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆమే తీసుకెళ్లింది...స్పష్టం చేసిన అధికారి
అమ్మవారికి సమర్పించిన చీర మాయంపై పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నిర్వహించిన విచారణతో పాటు, సీసీ ఫుటేజీలో కూడా ఆ విషయం నిర్ధారణ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో గురువారం రాత్రి సూర్యలతను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయమై దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా చేపట్టిన విచారణలో ఆమే చీర తీసుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని తెలిపారు. అందుకే తాము ఆమెని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కఠినంగా...వ్యవహరిస్తాం
దుర్గగుడిలో చీర మాయం ఘటనలో సూర్యలతకుమారే చీరను తీసుకెళ్లినట్లు విచారణలో తేలిందని, అందువల్ల ఆమెను పాలకమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందినట్లుగా దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబు తెలిపారు. ప్రస్తుతం సూర్యలతకుమారిని గుడి కార్యకలాపాలకు దూరంగా ఉంచామని స్పష్టం చేశారు. ఇకపై దుర్గగుడిలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చూస్తామని...ఏ విధమైన అక్రమాలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని గౌరంగబాబు చెప్పారు. దుర్గ గుడిలో వరుస వివాదాలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని...అవకతవకలపై ఇకముందు కూడా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications