షాక్: 'టిడిపితో పొత్తు విషయమై పునరాలోచన', 'బాబు ప్రభుత్వం మిత్రధర్మాన్ని పాటించాలి'
వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో కలిసి పోటీచేసే విషయమై బిజెపి పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదని బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్ చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన పక్షంలో టిడిపితో కలిసి పోటీచేసే విషయంపై బీజెపి పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదని బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్ చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు.
ఆమె విజయవాడలో ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు.ఎపిలో కూడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మీకు ప్రమాదమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా అనే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఈ విధంగా స్పందించారు.
ఎపి విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు బిజెపితో పాటు ఇతర పార్టీల నాయకులు కూడ సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మిత్రపక్ష ధర్మాన్ని బిజెపి నిర్వహిస్తోందని ఆమె చెప్పారు.
భవిష్యత్ లో ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో తమ జాతీయ అధ్యక్షుడు , ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకొంటారని ఆమె చెప్పారు.
రెండున్నర ఏళ్ళుగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా పురంధరేశ్వరీ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయంతో ఎపిలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను పార్టీ జాతీయ నాయకత్వం కేంద్రీకరించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంక్షేమ పథకాలకు సింహబాగం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల్లో మోడీ ఫోటో పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కార్ మిత్రపక్ష ధర్మాన్ని పాటించాలని ఆమె కోరారు.